రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతోంది..? టీడిపిలో జరిగినట్టే కాంగ్రెస్ లో కూడా జరుగుతోందా..?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిన్నటివరకూ పీసిసి పగ్గాలు రేవంత్ రెడ్డికి అదిష్టానం పక్కాగా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పెద్దయెత్తు ప్రచారం జరిగింది. ఏఐసిసి మాజీ అధినేత రాహుల్ గాంధీ తో ఉన్న సత్సంబంధాలు కూడా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ను పెంచేసాయి. తెలంగాణ కాంగ్రెస్ లో దాదాపు నంబర్ వన్ పోజీషన్ ఖాయమనుకునుకుంటున్న తరుణంలో అనుకోని విమర్శలకు గురౌతున్నారు రేవంత్ రెడ్డి. ఒక్కటంటే ఒక్క ప్రకటనతో ఆయనను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఆయన పార్టీ నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో రేవంత్ దూకుడు..! అడ్డుకునే ప్రయత్నంలో ఇతర నేతలు..!!
ప్రస్తుతం తెలంగాణలో ఒక్క గులాబీ పార్టీ పరిస్థితి తప్ప ఏ పార్టీ పరిస్థితి అంత బాగాలేనట్టు తెలుస్తోంది. 20మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో బలహీన పడిపోయింది. దాంతో శాసన సభలో ప్రదాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు భారతీయ జనతా పార్టీకి ప్రాణవాయువులు ఊదాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి మూడు, బీజేపి కీ నాలుగు ఎంపీ సీట్లను కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. దీంతో తెలంగాణలో ప్రాపర్ గా వెళ్తే ప్రభావం ఉంటుందనే భావనకు నేతలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణలో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు నడుం బిగించిన రేవంత్ రెడ్డికి పరిస్థితులు అంత అనుకూలించేలా కనిపించడం లేదు.
టీడిపిలో రేవంత్ కు ఇదే జరిగింది..! కాంగ్రెస్ లో కూడా తప్పదా..?
సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి, బలహీనంగా ఉన్న టీడిపిని బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక అడుగులు వేసారు. రైతు భరోసా యాత్రల పేరుతో తెలంగాణలోని అన్ని పాత జిల్లాలలో పర్యటించారు. రేవంత్ రెడ్డి పర్యటనలకు తెలంగాణ ప్రజానికం నుండి, రైతాంగం నుండి ఊహించని స్పందన వచ్చింది. మారు మూల గ్రామాల్లో కూడా టీడిపి జెండా బుజం మీద వేసుకుని రేవంత్ రెడ్డి కోసం జనాలు బారులు తీరిన సందర్బాలు కూడా ఉన్నాయి. పార్టీని ఓ కొలిక్కి తీసుకొస్తున్న తరుణంలో నేతల మద్య సఖ్యత కుదరక విభేదాలు రగులుకున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
చిచ్చు రగిల్చిన హుజురాబాద్ ఉప పోరు..! రేవంత్ ను తప్పుబడుతున్న నేతలు..!!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నప్పటికి ఒకరిద్దరు నేతలనుండి ప్రతిఘటన ఎదుర్కొంటూనే ఉన్నారు. రాకీయాలన్న తర్వాత విభేదాలు, అసంతృప్తులు సర్వ సాధారణమని భావించి రేవంత్ సర్దుకుపోయేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో పిసిసి అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలో తల దూర్చి విమర్శల పాలవుతున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి లాగే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు రేవంత్ విషయంలో అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదో ఒక కారణం కోసం ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్ధులు రేవంత్ రెడ్డి విషయంలో అదనుకోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే టీడిపిలో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి పై సీనియర్ల అసంతృప్తి..! అదిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం..!!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో చెలరేగిన వివాదంలో రేవంత్ రెడ్డిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్ధిగా పద్మావతి పేరును ప్రకటించి తప్పు చేసాడని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్న రేవంత్ రెడ్డి తాను చామల కిరణ్ రెడ్డి పేరును ఎలా ప్రకటిస్తాడని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన గ్రాఫ్ ను అనవసరంగా చెడగొట్టుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే ఇదే అంశంలో బహిరంగ ప్రకటన కూడా చేసారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పార్టీలో బహిరంగంగా విమర్శిస్తున్న నేతలకన్నా లోలోన రేవంత్ రెడ్డి దూకుడును ఎలా కట్టడి చేయాలని మరికొంత మంది ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంత మంది నేతలు మాత్రం ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని అసలు రేవంత్ రెడ్డికి పీసిసి రాకుండా చేయాలని అదిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులను రేవంత్ రెడ్డి ఎలా అదిగమిస్తారో చూడాలి.