ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏపీలో లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ వంటి టీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించి టీడీపీపై విమర్శలు గుప్పించారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంటి నేతలు థర్డ్ ఫ్రంట్ కోసం వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు.
సందర్భం వచ్చినప్పుడల్లా తెరాస నేతలు ఏపీ సీఎంపై నిప్పులు చెరుగుతున్నారు. డేటా చోరీ విషయంలో కేటీఆర్ టీడీపీని ఏకిపారేశారు. ఏపీ రాజకీయాల్లో కాలు పెడతామని తెరాస నేతలు చెప్పారు. వారి మాటలు కూడా ఏపీ రాజకీయాలపై కన్నేసినట్లుగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు టార్గెట్గా, జగన్కు అనుకూలంగా తెరాస ముందుకు సాగుతోంది.
అందుకే పవన్ కళ్యాణ్కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?
జగన్ను కేసీఆర్ దెబ్బతీస్తారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి కొంప ముంచిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు కేసీఆర్తో దోస్తీ జగన్ కొంప ముంచుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. టీడీపీ నేతలు కూడా పదేపదే కేసీఆర్ - జగన్ దోస్తీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమం సమయంలో ఏపీపై, ఏపీ ప్రజలపై, ఏపీ బ్రాహ్మణులపై, ఏపీ ఆహారంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తద్వారా ఏపీ వ్యతిరేకి అయిన తెలంగాణ సీఎంతో జగన్ దోస్తీ కట్టారని, అలాంటి వైసీపీ అధికారంలోకి వస్తే నవ్యాంధ్రకు నష్టమని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్తో కేసీఆర్ భేటీ వాయిదా?
టీడీపీ నేతలు చేస్తున్న ఆ ప్రచారం ప్రజల్లోకి బాగానే వెళ్తుందని, అది వైసీపీకి నష్టం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ కారణాన్ని కూడా చెబుతున్నారు. థర్డ్ ఫ్రంట్ కోసం.. జగన్, కేసీఆర్లు కలుస్తారని చెప్పారు. కానీ ఆ తర్వాత వారు కలవలేదు. కేసీఆర్ కలిస్తే తమకు ఏపీలో నష్టం జరుగుతుందని వైసీపీ భావించి, వాయిదా వేసినట్లుగా భావిస్తున్నారు. కేసీఆర్తో దోస్తీ కారణంగా నష్టం జరుగుతుందని వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
ఏపీ టీడీపీలో 'కేసీఆర్' ఉత్సాహం
అయిదేళ్ల చంద్రబాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలతో పాటు కేసీఆర్ ఫ్యాక్టర్ విషయంలో టీడీపీలో సరికొత్త ఉత్సాహంలో ఉందని అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు ఫ్యాక్టర్ పని చేసినట్లు, ఏపీలో కేసీఆర్ ఫ్యాక్టర్ పని చేస్తుందని టీడీపీ నేతలు కూడా బలంగా నమ్ముతున్నారట. తెరాస నేతలు ఒకింత బాహాటంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో వచ్చిన ప్రీపోల్ సర్వేలు వైసీపీకి ఏకపక్షంగా కనిపించాయి. కానీ కేసీఆర్ దోస్తీ బహిర్గతం అయ్యాక ఆ సర్వేల్లో మార్పు కనిపిస్తోంది. తాజాగా వచ్చిన సీ ఓటరు సర్వేలో టీడీపీకి ఎక్కువ లోకసభ సీట్లు వస్తాయని తేలడం గమనార్హం. టీడీపీ మూడు లేదా ఆరు సీట్ల నుంచి 14 సీట్లకు ఎగబాకగా, వైసీపీ 22 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గింది.