ఆ మీటింగ్తో కేటీఆర్ ఏం మెసేజ్ పంపించినట్లు... రాజ్యాంగ ఉల్లంఘన అంటున్న ప్రతిపక్షాలు....
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల మంత్రులందరితో ఏర్పాటు చేసిన సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అది ఇన్ఫార్మల్ మీటింగ్ అని,కేబినెట్ సమావేశమని సీఎస్ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడో.. లేక ఆరోగ్యం బాగా లేనప్పుడో... అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. అయితే కేటీఆర్ ఉన్నట్టుండి ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం వెనుక అసలు ఆంతర్యమేంటి...
ఆ ఒక్కటి కూడా తీరిపోయింది...
టీఆర్ఎస్లో అధినేత కేసీఆర్ తర్వాత ఆయన తనయుడే నంబర్.2 అన్నది జగమెరిగిన సత్యం. కేటీఆర్కు పోటీ అనుకున్న హరీష్ రావు ఎప్పుడో సైలెంట్ అయిపోయారు. కేసీఆర్ మాటను జవదాటేది లేదని... కేటీఆర్ నాయకత్వంలోనూ పనిచేసేందుకు సిద్దమేనని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో హరీష్ నుంచి కేటీఆర్కు లైన్ క్లియర్ అయింది. దాదాపుగా పాలనా వ్యవహారాలన్నింటిలోనూ ఆయన యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ఒక్క కేబినెట్ సమావేశాలు నిర్వహించడం మినహా పాలనాపరంగా ఇప్పటివరకూ అన్నింట్లోనూ ఆయన ప్రమేయం ఉంది. తాజాగా నిర్వహించిన కేబినెట్ తరహా సమావేశంతో ఆ ఒక్కటి తీరిపోయింది. దీంతో ఇక ఆయన సీఎం అవడమే తరువాయి అన్న ప్రచారం ఊపందుకుంది. కాబోయే 'సీఎం' అన్న సంకేతాలు మరోసారి బలంగా కేడర్లోకి,ప్రజల్లోకి పంపించేందుకే ఈ సమావేశం నిర్వహించారన్న చర్చ జరుగుతోంది.
సీఎం పదవికి ముందు రిహార్సల్స్..?
నిజానికి 2018,డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలోనూ కాబోయే సీఎం కేటీఆరే అన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదు. ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆరే బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఏదో సందర్భంలో కేటీఆర్ను కేసీఆర్ సీఎం చేస్తారన్న ప్రచారం అడపాదడపా వినిపిస్తూనే ఉంది. తాజాగా కేటీఆర్ మంత్రులతో నిర్వహించిన సమావేశంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు ఇది రిహార్సల్ లాంటిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
కొత్త సచివాలయంలో ఆయనే సీఎంగా...?
పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వాస్తు రీత్యా కొత్త సెక్రటేరియట్ కడితేనే తన కుమారుడు సీఎం అవుతాడన్న నమ్మకంతో కేసీఆర్ దీన్ని నిర్మిస్తున్నారన్న విమర్శలున్నాయి. విమర్శల సంగతి పక్కనపెడితే... కేటీఆర్ కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహిస్తూ దూకుడు పెంచడం... త్వరలోనే సీఎం అవుతానన్న సంకేతాలు పంపించడమేనన్న చర్చ జరుగుతోంది. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో కేటీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఎంతోమంది ప్రముఖ నేతల కుమారులు ముఖ్యమంత్రులు అయ్యారని...కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంలో ఆశ్చర్యమేమీ లేదని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతుండటం కూడా దీనికి బలం చేకూరుస్తోంది.
రాజ్యాంగ ఉల్లంఘన అంటున్న ప్రతిపక్షాలు
కేటీఆర్ కేబినెట్ సమావేశం.. తానే కాబోయే సీఎం అని సీనియర్ మంత్రులకు,కేడర్కు మరోసారి సంకేతాలు పంపించేందుకే అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. తప్పదు కాబట్టి మంత్రులు హరీష్ రావు,ఈటల రాజేందర్ సమావేశానికి హాజరయ్యారని... లోలోపల మాత్రం విసుగ్గా ఫీల్ అయి ఉంటారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. అసలు ఓవైపు జనాలు కరోనాతో చనిపోతుంటే... ఆ సబ్జెక్టుపై కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తానే కాబోయే సీఎం అని పరోక్షంగా చెప్పేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అన్నారు. ఇక బీజేపీ నేతలు ఈ సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శిస్తున్నారు. ఇన్ఫార్మల్ మీటింగ్ పెట్టుకోవాలంటే గెట్ టు గెదర్ లేదా లంచ్ మీటింగ్ పెట్టుకోవాలని... ఇలా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని మండిపడుతున్నారు.