ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎలక్షన్లకు ముందు సర్వేలు హడావిడి చేస్తే.. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు. విజయం ఎవరిని వరించనుంది. అధికారంలోకి ఎవరొస్తారు. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఈనెల 11న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూసే జనాలకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
ఈక్రమంలో అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? ప్రిపోల్స్ కు ఎగ్జిట్ పోల్స్ కు తేడా ఏమిటి? ఎన్నికలకు ముందు జరిగే ప్రిపోల్స్ తో పాటు.. ఓటింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై కూడా భారీగా అంచనాలు ఉండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.
ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి.. ఎలా నిర్వహిస్తారు?
ఎన్నికల్లో భాగంగా ఆయా సంస్థలు ప్రిపోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. ప్రిపోల్స్ ను ఎలక్షన్లకు ముందుగా చేపడతారు. ఆయా పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తారు. దీనికోసం నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వారితో మాట్లాడి ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉందనే విషయం సేకరిస్తారు. దీన్నిబట్టి సర్వేలు వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ జరిగేటప్పుడు నిర్వహిస్తారు. సెలెక్ట్ చేసిన పోలింగ్ కేంద్రాలకు ప్రతినిధులను పంపి ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేస్తారో ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రకటిస్తారు.
ప్రిపోల్స్ Vs ఎగ్జిట్ పోల్స్
ఎన్నికలకు ముందు నిర్వహించే ప్రిపోల్స్ లో కాస్తోకూస్తో కచ్చితత్వం ఉంటుందనే అభిప్రాయముంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నాడిని పసిగట్టి ఆయా పార్టీలు గెలిచే సీట్లను ప్రిపోల్స్ ప్రకటిస్తాయి. అయితే అభ్యర్థులను ప్రకటించకముందే సర్వేలు చేయడం, ఓటింగ్ నాటికి చాలాముందుగా ప్రిపోల్స్ నిర్వహించడం చేస్తుంటారు. అంటే ప్రిపోల్స్ లో ఎవరిదైతే అభిప్రాయం తీసుకుంటారో వారు అప్పటికీ ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్దిష్ట నిర్ణయం తీసుకోకపోవచ్చనే భావన ఉంది. మరో ముఖ్యవిషయం ఏంటంటే.. ఎప్పుడో జరిగే ఎన్నికలకు అప్పుడు తమ తీర్పు చెప్పే ఓటర్లు అసలు పోలింగ్ సమయానికి ఓటు వినియోగించుకుంటారా అనేది ప్రశ్నార్థకమే.
అందుకే ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారుతాయి. ఎందుకంటే ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తులతో మాట్లాడటం, ఏ పార్టీకి ఓటు వేశారో తెలుసుకోవడం లాంటి అంశాలు కచ్చితమైన ఫలితాలు ఇస్తాయనే ఒక నమ్మకం ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అంతేగాకుండా ఓటింగ్ శాతం కూడా ఎగ్జిట్ పోల్స్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా..!
పోలింగ్ ముగిసిన వెంటనే రెండు మూడు గంటల పాటు ఎగ్జిట్ పోల్ ట్రెండ్ నడుస్తుంటుంది. ఆయా సంస్థలు ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉంటాయి. ఒక పార్టీకి 100 స్థానాలు వస్తాయని ఒక సంస్థ చెబితే.. మరో సంస్థ 70-80 సీట్లు వస్తాయని ప్రకటిస్తుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ చర్చానీయాంశంగా మారుతాయి. అయితే కొన్ని పేరున్న సంస్థలు వెలువడించే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అదలావుంటే కొన్ని సందర్భాల్లో 4-5 సంస్థలు ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి పట్టం కడితే.. ఒకటి రెండు సంస్థలు మరో పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతాయి. ఇటువంటి నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ రావడం సహజం. కానీ మాగ్జిమామ్ సంస్థలు చెప్పిన పార్టీనే విజయం వరిస్తుందని చెప్పొచ్చు.