సీఎం కేసీఆర్ ఎక్కడ?: గేటుకు తాళం, మహిళా వైద్యురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత, నేతల అడ్డగింత
హైదరాబాద్: శంషాబాద్లో దారుణ హత్యకు గురైన మహిళా వెటర్నరీ వైద్యురాలి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మృతురాలి కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ 'నక్షత్ర విల్లా' వద్ద శనివారం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
గేటుకు తాళం..
ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున కాలనీవాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనలు చేపట్టారు. కాలనీ గేటుకు లోపలి నుంచి తాళాలు వేసి, పోలీసులు, నాయకులు అటువైపు రావద్దంటూ బోర్డులు ప్రదర్శిస్తున్నారు. అంతేగాక, విల్లాలో ఉన్న పోలీసులను కూడా బయటికి పంపేశారు.
తెలంగాణ డాక్టర్ మృతికి నిరసనగా.. చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత, ‘మహా ప్రదక్షిణం'
సీఎం కేసీఆర్ ఎక్కడ?
అక్కడే బైటాయించిన వారు.. స్థానికులను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇంత పెద్ద ఘోరం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరా? అని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సానుభూతి వద్దు.. న్యాయం కావాలి..
మృతురాలి కుటుంబసభ్యులకు సానుభూతి, పరామర్శలు వద్దని.. న్యాయం కావాలని నినాదాలు చేస్తున్నారు నిరసనకారులు. మీడియాతోపాటు నాయకులు ఎవరూ కూడా పరామర్శలకు రావొద్దని నినదిస్తున్నారు. కాగా, స్థానికుల నిరసనల నేపథ్యంలో పోలీసులతోపాటు పలువురు నేతలు కూడా అక్కడి వరకు వెళ్లి వెనుతిరిగారు. బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలను అడ్డుకున్నారు. దీంతో వారు కూడా నిరనసన చేస్తున్న ప్రజలకు మద్దతు తెలిపారు.
చర్లపల్లి జైలులో నలుగురు నిందితులు
బుధవారం రాత్రి మహిళా డాక్టర్పై నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం నిందితులను మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు భారీ భద్రత నడుమ తరలించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ అటు షాద్ నగర్ పోలీస్ స్టేషన్.. ఇటు చర్లపల్లి జైలు వద్ద భారీగా చేరుకున్న ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు లాఠీ ఛార్జీ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.