సీఎం అయ్యే అర్హత దళితులకు లేదా..? పాలించడం రాదా.. కేసీఆర్పై కిషన్ రెడ్డి నిప్పులు
తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు జోరందుకున్నాయి. యాసంగి పంట కొనుగోలు గురించి రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మరీ విమర్శలు చేశారు. దీంతో బీజేపీ అగ్రనేతలు కూడా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేస్తారా? చేయరా? సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్య రైతులది కాదని, కదులుతోన్న టీఆర్ఎస్ పార్టీ పునాదులదే అసలు సమస్య అన్నారు.

అర్హత లేదా..?
దళితులు ముఖ్యమంత్రి పదవీకి అర్హులు కాదా? సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం లేని సమస్యను సృష్టించి రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్ళుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటుందని వివరించారు. హుజురాబాద్ ఓటమిని డైవర్ట్ చేయటానికే కేంద్రంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్టీని బ్రతికించుకోవటానికి సీఎం కేసీఆర్ ధర్నాలు చేయటం తొలిసారి చూస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.

నిలిచిన పనులు
కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయని వివరించారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. కేసీఆర్ కుటుంబం శక్తినంతా ధారపోసినా హుజురాబాద్లో ఓటమి తప్పలేదన్నారు. బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్గా పోచంపల్లి గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబరు 6న విద్యార్థుల స్కాలర్ షిప్స్ను జమ చేస్తామన్నారు. సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు నవ తరానికి తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

బయటపడన బండారం
అంతకుముందు కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నేతల గుట్టు మొత్తం బయటపడిందని విమర్శించారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ చిల్లర పనులు మానుకోవాలని కేసీఆర్ అన్నారు. గుట్టు మొత్తం బయటపడిందని తెలిపారు. మీరేంటో అందరికీ అర్థం అయిందన్నారు. మీ కథేందో తెలిసిపోయింది జనాలకు. వాళ్లకు పూర్తిగా అర్థం అయిందన్నారు. తప్పుకు పొరపాటు అయింది.. క్షమించమని చెంపలేసుకొని ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. అనవసరమైన బేషజాలకు పోకుండా... వాస్తవాలు ప్రజలకు తెలపాలని సూచించారు. రైతులు కూడా బీజేపీ నేతల మాటలు పట్టుకొని ఆగం కావద్దని సూచించారు. రైతులను ఇకనైనా తప్పుదోవ పట్టించొద్దు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది.