కేసీఆర్.. ఆంధ్రాకా, తెలంగాణకా సీఎం... నదుల అనుసంధానం కామెంట్లపై సీపీఐ రామకృష్ణ
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్పై సీపీఐ నేత కే రామకృష్ణ ఫైరయ్యారు. నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్ చేస్తున్న కామెంట్లు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎంలా కాకుండా ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్టు ప్రవర్తిసున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ పార్టీలో చేరేది బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారేనని స్పష్టంచేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి కాస్త అనుమానంగా ఉందని రామకృష్ణ అన్నారు. నదుల అనుసంధానం గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్, నీటిపారుదల శాఖ అధికారుల మాటలు కాస్త అనుమానంగా ఉందన్నారు. ఏపీ సీఎంగా కేసీఆర్ ప్రవర్తిస్తుంటే జగన్ మిన్నకుండి చూస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు 100 రోజుల్లో జగన్ పాలన పడకేసిందని విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఆ మాటే మరచిపోయారని రామకృష్ణ ఫైరయ్యారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు వారి నోటి నుంచి మాట పెకలబోదని స్పష్టంచేశారు. బీజేపీలో చేరే వారు ఆర్థిక నేరస్తులేనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. జనం మద్దతు ఉన్న నేతలేవరు ఆ పార్టీలో చేరడం లేదన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన వారే చేరుతున్నారని పేర్కొన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కాషాయ కండువా కప్పుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.