మేయర్ : సీల్డ్ కవర్లో ఎవరి పేరు.. ఆ వర్గానికే ప్రాధాన్యత... కేసీఆర్ ఎవరెవరి పేర్లు పరిశీలించారంటే?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపై బుధవారం(ఫిబ్రవరి 11) ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ సహా నగరానికి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కేసీఆర్ మేయర్,డిప్యూటీ మేయర్ల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గురువారం(ఫిబ్రవరి 11) ఉదయం తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో ఆ పేర్లను వెల్లడించనున్నారు.
ఆ సామాజికవర్గానికే...
రాష్ట్ర రాజకీయాల్లో బలమైన సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికే మేయర్ పదవిని కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవిని గతంలో లాగే మైనారిటీ వర్గానికి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరు ఎవరా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం ఉదయం సీల్డ్ కవర్లో ఆ ఇద్దరి పేర్లు తెలంగాణ భవన్కు చేరనున్నాయి. అక్కడ కార్పోరేటర్లు,నగరానికి చెందిన ఎంపీలు,మంత్రులు,ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి కేటీఆర్ ఆ పేర్లను వెల్లడించనున్నారు.
జాబితాలో ఎవరెవరి పేర్లు...
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజే భారతీనగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పేరును మేయర్గా ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా సీఎం కేసీఆర్ పరిశీలించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆమె పేరు ఉన్నట్లు తెలుస్తోంది. భారతితో పాటు ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి,తార్నాక కార్పోరేటర్ మోతె శ్రీలత,ఎంపీ కేశవ రావు తనయ,బంజారాహిల్స్ కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మి పేర్లను కేసీఆర్ పరిశీలించినట్లు సమాచారం. అలాగే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతల విజయశాంతి పేరును కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వీళ్లలోనే ఒకరికి మేయర్ పదవికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
మైనారిటీకే డిప్యూటీ మేయర్ పదవి...
గతంలో బోరబండ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ను డిప్యూటీ మేయర్ను చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పదవి కోసం అల్లాపూర్ డివిజన్ నుంచి ఎన్నికైన రెహనా బేగంకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో సమావేశం తర్వాత కార్పోరేటర్లు,గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి తరలివెళ్లనున్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ మేయర్,డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనుంది.