మాకి కిరికిరి ఎవరు అడ్డొస్తారో చూస్తాం..! కొత్త అసెంబ్లీ కట్టి తీరుతామన్న తలసాని..!!
హైదరాబాద్: తెలంగాణలో భవంతులు నిర్మాణాలపై బాంబుల లాంటి మాటల పేలుతున్నాయి. సచివాలయం, అసెంబ్లీ కొత్త భవంతుల నిర్మాణం ఇప్పుడెందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండగా అరునూరైనా కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించి తీరుతామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు గర్వపడేలా ఆ భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ నేతలు సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వంపై చేసిన పలు విమర్శలను మంత్రి తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. పిక్నిక్ కోసం వచ్చినట్లు సచివాలయానికి వచ్చివెళ్లారని ఎద్దేవాచేశారు. నాలుగు గంటల పాటు అన్ని భవనాలను పరిశీలించవచ్చు కదా? అని అన్నారు. నూతన భవనాల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలాగే తామూ రొటీన్ పాలన అందించాలని వారు కోరుకుంటున్నారని.. ప్రజలకు అవసరమైన పనులనే తమ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.
అసెంబ్లీ, సచివాలయ నూతన భవనాలు ప్రభుత్వానికి సంబంధించినవే తప్ప సీఎం కేసీఆర్కు సంబంధించినవి కాదన్నారు. అది కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదా? అని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు చూడలేకనే ఆ పార్టీని ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారన్నారు. ప్రతిపక్ష నేతగా ఎస్సీ నేత ఉండటం సొంత పార్టీ నేతలకే ఇష్టంలేదని విమర్శించారు. వర్షం పడితే ఏ నగరంలోనైనా గంటపాటు ఇబ్బందులు సాధారణమేనని చెప్పారు. ఒక్క హైదరాబాద్లోనే ఏదో జరుగుతోందనే దుష్ప్రచారం సబబుకాదన్నారు. తాటాకు చప్పుళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఎక్కడా కట్టలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. వారు క్షేత్రస్థాయిలోని జనం మధ్యకు వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని తలసాని హితవు పలికారు.