కేసీఆర్, జగన్కు కులతోకలు ఎందుకు.. నెట్టింట డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు రచ్చ రచ్చ..!
హైదరాబాద్ : ముక్కుసూటిగా మాట్లాడతారు. యాక్షన్ సరిగా లేకుంటే సెట్లోనే హీరోహీరోయిన్లను వాయించేస్తారు. ఎంతటివారినైనా చాలా లైట్గా తీసుకుంటారు. ఇదంతా తెలుగు సినిమా డైరెక్టర్ తేజ నైజం. అయితే ఆయన కులపిచ్చిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ప్రభుత్వంలో ఉండే ఎవరైనా సరే రెడ్లు, రావులంటూ తోకలు తగిలించుకోవడం సరైన పద్దతి కాదంటున్నారు తేజ. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ.. వారు ఆ తోకలు తీసేస్తే బాగుంటుందనే రీతిలో ఆయన మాట్లాడటం చర్చానీయాంశమైంది.
కులమతాల పిచ్చి మేధావులకెందుకు..!
డైరెక్టర్ తేజ ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. అయితే ఆయన కులమతాల పిచ్చి గురించి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వాటి కారణంగానే ఇండియా 50-60 ఏళ్లు వెనుకబడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కులమతాల ప్రస్తావన గానీ, పిచ్చి గానీ తక్కువ స్థాయిలో ఆలోచించే వారికే ఉంటుందే తప్ప మేధావులకు ఉండకూడదన్నట్లుగా మాట్లాడారు.
క్యాస్ట్ ఫీలింగ్, రీలిజియన్ ఫీలింగ్, జిల్లా ఫీలింగ్, ఫ్యాన్స్ ఫీలింగ్, ఏరియా ఫీలింగ్... ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లనీ కొట్టిపారేశారు తేజ. వాటితో ఎలాంటి లాభముండదని వ్యాఖ్యానించారు. కులమతాల ప్రస్తావన లేకుంటేనే అన్నీ సవ్యంగా జరుగుతాయని.. అవి రాజ్యమేలితే కష్టమేనన్నట్లుగా మాట్లాడారు.
మంచిర్యాలలో
కిలాడీ..
ఉద్యోగాల
పేరిట
బురిడీ..
కోటి
రూపాయలకు
పైగా
మోసం
కులమతాల పిచ్చి ఎందుకో.. తేజ వ్యాఖ్యల దుమారం
తనకు కులపిచ్చి లేదన్న తేజ.. తాను కనీసం ఇంటిపేరు కూడా పెట్టుకోనని సదరు వీడియోలో తేల్చి చెప్పారు. తాను వాటికి చాలా దూరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, జగన్.. వీళ్లందరు కూడా రావులు, రెడ్లనీ గర్వంగా చెప్పుకుంటూ తోకలు తగిలించుకుంటారని.. వాటివల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండే వాళ్లకు ఈ కులాల రొచ్చు ఎందుకో అర్థం కాదని వాపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఇండియాను వెనక్కి లాగడానికా అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు.
ఇండియాలో కనిపించినంత కులమతాల పిచ్చి ప్రపంచంలో ఎక్కడా కనపడదేమో అని వ్యాఖ్యానించారు తేజ. ఇంతకు బిల్ గేట్స్ ఏ కులానికి చెందినవారు.. మరి వారి ప్రొడక్ట్ మైక్రో సాఫ్ట్ విచ్చలవిడిగా వాడేస్తున్నాముగా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఆపిల్ ఫోన్స్ వాడేస్తున్నాం. అలాగే శ్యాంసంగ్ ఫోన్స్ కంపెనీ హిందువుకు చెందిన కంపెనీ కాదు. మరి ఆ ఫోన్లు కూడా తెగ వాడేస్తున్నాం. కులమతాల గురించి బాగా పట్టించుకునేవాళ్లు.. మరి అలాంటి వస్తువులు వాడొద్దు కదా అన్నట్లుగా ఆయన మాట్లాడారు.
క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే.. అన్నం తినే దగ్గర ఆలోచించరెందుకో?
కులమతాల గురించి పీక్ స్టేజీలో ఆలోచిస్తే కనీసం అన్నం తినడానికి కూడా మనకు అర్హత ఉండదన్నట్లుగా వ్యాఖ్యానించారు తేజ. కులమతాలకు అతీతంగా ఎందరో పనిచేస్తే మన నోటి దగ్గరకు అన్నం వస్తోంది. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఎవరి కులపోళ్లు పండించింది వాళ్లే తినాలని.. ఆ కులపోళ్ల దగ్గరే పనిచేయాలని చెప్పుకొచ్చారు. అది మాత్రం సాధ్యం కాదని అందరూ చేతులు దులుపుకుంటారని ఎద్దేవా చేశారు. కానీ కులం మతం అంటూ తెగ రెచ్చిపోవడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు.
అయితే తేజ మాట్లాడిన ఈ వీడియో ఇప్పటిదా, పాతదా అన్నది మాత్రం నిర్ధారణ కావడం లేదు. ఆ వీడియో పాతదైనా, కొత్తదైనా కులమతాల ప్రస్తావన ఉండేసరికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కులమతాల పిచ్చి ఉండకూడదని, వారి పేర్ల వెనుక తోకలు తగిలించుకోవడం సరికాదని తేజ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.