అక్రమ నిర్మాణాలపై ఎందుకు కొరడా ఝలిపించడం లేదు..? జీహెచ్ఎంసీ కి కోర్ట్ సూటి ప్రశ్న..!!
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో నగర పాలక సంస్థ విఫలం అయ్యిందని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి మించి అంతస్తులు కడుతుంటే అవి పూర్తయ్యేదాకా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్ట్ నగరపాలక సంస్థను ప్రశ్నించింది. ప్రాథమికంగా ఎందుకు అడ్డుకోలేకపోయారు? పర్యవేక్షణ సమర్థత లేదా? అంటూ నిలదీసింది. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోడానికి అధికారాలున్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్య తీసుకోడానికి అవినీతి నిరోధక చట్టంతోపాటు పలు చట్టాల కింద వెసులుబాటు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది.
విధి నిర్వహణలో వైఫల్యమా..? ఐతే అదికూడా అవినీతే అన్న కోర్ట్..!!
అందరికీ కనిపించే అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ అధికారులకు కనిపించకపోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. కూకట్పల్లిలోని కొన్ని నిర్మాణాలను కూల్చివేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని జి.నాగేశ్వరరావు తదితరులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నారు..? అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కింది స్థాయి అధికారులు కూడా అలాగే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి చట్టప్రకారం నోటీసులు ఇస్తున్నామని తెలపగా, అంతకుముందే అక్రమ నిర్మాణాలను మీ అధికారులు ఎందుకు గుర్తించడంలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలను గుర్తించని క్షేత్రస్థాయి అధికారులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమనిర్మాణాలపై ఉదాసీనత పనికి రాదు..! అదికారులు అప్రమత్తంగా ఉండాలన్న కోర్టు..!
రెండంతస్తులకు అనుమతులు తీసుకుని అదనంగా మూడంతస్తులు నిర్మిస్తున్నారు. అక్రమంగా నిర్మించినవాటిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తే ఇలాంటి కేసులు కోర్టులకు వస్తున్నాయి. అనుమతికి మించి మరో అంతస్తు నిర్మాణం చేపట్టినపుడే ఎందుకు అడ్డుకోలేరు, క్షేత్రస్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారు, వారిపై నియంత్రణ ఎందుకు లేదని కోర్ట్ అదికారులను సూటిగా ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీపై హైకోర్టు ఘాటు స్పందన..! చట్టాలను నీరుకార్చొద్దని హితవు..!!
ఆక్రమణదారులకంటే ముందు అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. అవినీతి నిరోధక చట్టం-1988లోని పలు నిబంధనలు ‘అవినీతి'కి విస్తృతార్థాన్ని చెప్పాయి. విధులు, బాధ్యతలకు భిన్నంగా పనిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటి కింద క్షేత్రస్థాయిలోని అధికారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై మీ చర్యలేమిటో చెప్పండని జీహెచ్ఎంసీ ఉన్నతీదికారులను కోర్ట్ మందలించింది.