ఎందుకు హైదరాబాద్లోనే తక్కువ ఓటింగ్... లోపమెక్కడ... ఇవే కీలక కారణాలా?
ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. నిజానికి గతంతో పోలిస్తే ఓటింగ్ పెరిగినప్పటికీ... నగర ఓటరు మహా బద్దకిస్టు అని మరోసారి రుజువైంది. అయితే ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల ఓటర్లందరూ బద్దకిస్టులేనని గత డేటాను పరిశీలిస్తే అర్థమవుతోంది. 2015లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 40శాతం ఓటింగ్ నమోదవగా... 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 54శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. కేవలం మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు అసెంబ్లీ,లోక్సభ ఎన్నికల్లోనూ మెట్రో నగరాల్లో ఓటింగ్ అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇలా నగరాల్లో మాత్రమే తక్కువ ఓటింగ్ నమోదవడానికి గల కారణాలేంటి....
జనాగ్రహ రీసెర్చ్ ప్రాజెక్ట్...
2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.95శాతం, 2016లో 45.27శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి ఓటింగ్ 1.28శాతం పెరిగి 46.55శాతం నమోదైంది.డిసెంబర్,2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 74శాతం ఓటింగ్ నమోదవగా.. హైదరాబాద్లో 50శాతం ఓటింగ్ నమోదైంది. ఇలా హైదరాబాద్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై బ్రౌన్ యూనివర్సిటీతో కలిసి జనాగ్రహ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా పట్టణ పరిపాలనా,పౌరసత్వం,సేవలు తదితర అంశాలను జనాగ్రహ రీసెర్చ్ అధ్యయనం చేస్తోంది.
ఓటింగ్ తగ్గడానికి కారణాలు...
జనాగ్రహ రీసెర్చ్ ప్రాజెక్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం... తక్కువ ఓటింగ్ శాతంపై నగర ప్రజలను ఆరా తీయగా దాదాపు 39శాతం మంది తమ ఓటు నమోదు చేసుకోలేదని చెప్పారు. ముంబైలో ఈ సంఖ్య 61శాతం ఉండగా చెన్నైలో 46శాతం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని మురికివాడలు,గుడిసెల్లో నివసించే జనాల్లో చాలామందికి ఓటు హక్కు లేదని తేలింది. ఈ సంఖ్య దాదాపు 58శాతంగా ఉంది. ఒకవేళ ఓటు రిజిస్టర్ చేసుకున్నా... చివరి నిమిషంలో వారి పేరు బూత్ ఓటర్ల జాబితాలో లేదని చెప్తుండటంతో కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 28శాతం మంది ఇలా ఓటింగ్కి దూరమయ్యారు.ఓటర్ ఐడీ కార్డు లేని కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయినట్లు 37శాతం మంది చెప్పారు. అలాగే కొంతమంది ఓటర్లు నిరాసక్తితో ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు.
బీఎల్వో వ్యవస్థలో లోపాలు...
మరో అధ్యయనం ప్రకారం... బూత్ లెవల్ అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం. కేంద్ర ఎన్నికల సంఘానికి బూత్ లెవల్ అధికారులు ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఓటరు డేటా సేకరించడం,వెరిఫై చేయడం,విజ్ఞప్తులను స్వీకరించడం తదితర అంశాలనే వారే చూసుకుంటారు. అయితే ఈ అధికారులకు ప్రజలకు మధ్య గ్యాప్ ఉండటంతో... తమ అభ్యంతరాలను,విజ్ఞప్తులను ఓటర్లను వాళ్ల దృష్టికి తీసుకువెళ్లలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా 21 నగరాల్లో ఉన్న 9833 బూత్ లెవల్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు రీసెర్చ్ టీమ్ ప్రయత్నించగా... అందులో కేవలం 2305 నంబర్లు మాత్రమే కనెక్ట్ అయ్యాయి. ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిన బూత్ లెవల్ అధికారుల(బీఎల్వో) ఫోన్ నంబర్లలో చాలా మట్టుకు తప్పుగా ఉన్నాయి. మొత్తంగా బీఎల్వో వ్యవస్థలో లోపాలు కూడా ఓటు నమోదు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.