పీసిసి నేతల దిగ్బంధనం ఎందుకు.?అరెస్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గులాబీ పార్టీ కి మైనస్.!
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కల సాకారమై నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా జరిగిన పోరాటంలో ఘనవిజయం సాధించిన స్వేఛ్చావాయువులకు ఆరేళ్లు పూర్తవుతోంది. ఆరేళ్లలో తెలంగాణ ప్రజానికానికి అన్ని రంగాల్లో న్యాయం జరిగిందా..? బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, నిరుపైదల సంక్షేమం, నిరుద్యోగ భృతి, సమసమాజ స్దాపన వంటి అంశాల్లో స్వాలంభన దిశగా అగుగులు పడ్డాయా..? అంటే ప్రతిపక్షపార్టీలు పెదవి విరుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ విధానాలపై మండిపడుతోంది.
తెలంగాణలో విచిత్ర పరిస్ధితులు.. ఓపక్క సంబురాలు.. మరోపక్క అరెస్టులు..
ప్రాజెక్టుల పట్ల సీఎం చంద్రశేఖర్ రావు వైఖరికి నిరసనగా దీక్షచేసేందుకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను గృహనిర్బందించండం, అరెస్టులు చేయడం వంటి చర్యలపై తెలంగాణ ఆవిర్బావ వేడుకలు కూడా ఆవిరైపోయినట్టు తెలుస్తోంది. అరెస్టుల వల్ల అధికార గులాబీ పార్టీకన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రజామోదం లభించినట్టు తెలుస్తోంది. అసలు మూడు జిల్లాల్లో ప్రాజెక్టుల బాట పడుతున్న కాంగ్రెస్ నేతలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలి ఎక్కువ ప్రచారం కల్పించామనే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆవిర్బవం దినోత్సవం రోజున అరెస్టులు.. మాంచి మైలేజీ కొట్టేసిన కాంగ్రెస్ పార్టీ..
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తమ వాదనలు వినిపించలేని పరిస్థితుల్లో ఉన్నామని, తాము చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను తొక్కేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం కొంతకాలం నిశ్శబ్దంగా మారింది. క్లిష్ట సమయంలో అదికార పార్టీని విమర్శించడం తగదని సంయమనంగా ఉండిపోయారు. కాగా కరోనా నుండి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ, ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతూ ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ వచ్చి ఆరేళ్లు అవుతున్నా,పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
హౌస్ అరెస్టుల నిర్ణయం సరికాదు.. గుణుక్కుంటున్న గులాబీ నేతలు..
అందుకు తగ్గట్టు గానే వారు చేసే నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోకుండా ఉండేందుకు పోలీసులను రంగంలోకి దించింది తెలంగాణ ప్రభుత్వం. ఆందోళనలు చేపట్టే కాంగ్రెస్ నేతలు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించారు. కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఊహించని రీతిలో మొహరించిన పోలీసులతో కాంగ్రెస్ నేతలు అవాక్కు అయ్యారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం సొంతం రాష్ట్రంలో లేదా అంటూ మండిపడుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అభద్రతా భావంలోకి వెళ్లిపోయింది.. ఘాటుగా విమర్శిస్తున్న కాంగ్రెస్..
ఐతే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజునే ప్రాజుక్టుల వద్ద నిరసన దీక్షకు రంగం సిద్దం చేసుకున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం పట్ల తెలంగాణ ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుండి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం కన్నా, కాంగ్రెస్ నేతల గృహనిర్బంధాలే ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా ప్రచారం కావడంతో గులాబీ పార్టీ నేతలు అవాక్కవుతున్నట్టు తెలుస్తోంది. నిరసన తెలుపుకునేందుకు వెళ్లనిచ్చినా ఇంత ప్రచారం వచ్చి ఉండేది కాదని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సం రోజుల ప్రభుత్వానికి ఎంతో మైనస్ జరగ్గా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసొచ్చిందనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.