ఓటు ఎందుకు వేయాలో చెప్పండి, బీజేపీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న
భారతీయ జనతా పార్టీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని అడిగారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. జన హితమే ముఖ్యం అనే విషయాన్ని మరచిపోయారని తెలిపారు.
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారని చెప్పారు. బీజేపీతో పోటీలో దిగి తేల్చుకుంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ వాణి ముందుకు వచ్చారని కేటీఆర్ వివరించారు. ఏ ప్రభుత్వాలు చేయని ఉద్యోగ నియామకాలు చేశామని తెలిపారు. చిరుద్యోగుల శ్రమదోపిడి తగ్గించామన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో అన్నీ వర్గాల ఉన్నతి కోసం పాటుపడుతున్నామని కేటీఆర్ చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమమే తమ ప్రయారిటీ అని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతీసారి తాము చెప్పామని.. జనం విశ్వసించారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెబుతారని తెలిపారు. జరుగుతోన్న పరిణామాలను బట్టి అంచనా వేస్తున్నామని వివరించారు.