మటన్ తెచ్చిన తంటా..! ముక్క తినలేదని మొగుడిపై పోలీస్ కంప్లైంట్!
హైదరాబాద్ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల పాటు సంసారం సజావుగానే సాగింది. కానీ మటన్ ముక్క కాపురంలో నిప్పులు పోసింది. భర్త నాన్ వెజ్ తినడంలేదని భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ముక్క తినకుండా తనను హింసిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది.
కోటీశ్వరుడిని పెళ్లాడాలనుకుంది.. నిండా మునిగిపోయింది.. లక్షలతో ఉడాయించిన పెళ్లికొడుకు
ప్రేమ వివాహం
సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన రహ్మత్ నగర్కు చెందిన యువతి, సైదాబాద్కు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజికవర్గాలు ఒకటే సామాజికవర్గం. అయితే భర్త కుటుంబీకులు పూర్తి శాఖాహారులు. తమకు ముక్కవాసన పడదని యువకుడు ముందే చెప్పాడు. ఒకవేళ నాన్ వెజ్ తినాలనిపిస్తే బయట తినాలని పెళ్లికి ముందే షరతు విధించాడు. అందుకు అమ్మాయి అంగీకరించడంతో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.
మటన్ పెట్టిన మంట
నాలుగు నెలల పాటు వారి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఇంట్లో నాన్ వెజ్ తిననని చెప్పిన భార్య మాట మార్చింది. ఇంట్లో మటన్ వండితీరాలని పట్టుబట్టింది. దీనికి భర్త కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా పంతం కొద్దీ మటన్ వండటమే కాక.. మటన్ ముక్కలు తినాలని భర్తపై ఒత్తిడి చేసింది. అందుకు అతను అంగీకరించకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
నాన్ వెజ్ తినేందుకు నిరాకరించిన భర్తకు బుద్ధి చెప్పాలని భావించిన భార్య జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. భార్యభర్తల మధ్య గొడవకు మటన్ ముక్క కారణమన్న విషయం తెలిసి అవాక్కవడం పోలీసుల వంతైంది. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పోలీసులు భార్యభర్తల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కు పంపారు.