పెళ్ళాం టీ ఇవ్వలేదని ప్రాణాలు తీసుకున్న భర్త ... షాక్ లో భార్య
సంసారం అంటేనే అనేక చిన్న చిన్న చికాకులు ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న ఘర్షణలు సైతం కామనే. అయితే చిన్న కారణానికి మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అది ఆ భార్యకు ఒకింత షాక్ అనే చెప్పాలి. భార్య టీ పెట్టి ఇవ్వలేదని ఒకే ఒక చిన్న కారణంతో అలిగిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ బాలయ్య నగర్ కు చెందిన 35 సంవత్సరాల వయసున్న అడివయ్య ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో చక్కగా సంసారం చేసుకుంటున్న అడివయ్య ఎవరూ ఊహించని విధంగా చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను తనకు టీ పెట్టి ఇవ్వమని అడిగాడు. అయితే భార్య ఇంటి పనుల్లో బిజీగా ఉండటంతో కాసేపు ఆగాలని భర్తకు చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన అడివయ్య భార్యతో ఘర్షణ పడ్డాడు. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా టీ కోసం గొడవపడి అలిగిన ఆ భర్త క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికులకు షాక్ లా అనిపించింది. అడివయ్య కేవలం టీ కోసం ప్రాణాలు తీసుకున్నాడని తెలియడంతో అందరూ నివ్వెరపోయారు. క్వారీ గుంతలో దూకి ప్రాణాలు తీసుకున్న భర్త మృతదేహం వద్ద భార్య జ్యోతి, పిల్లలు గుండెలవిసేలా రోదించారు.
టీ ఇవ్వనందుకే ప్రాణాలు తీసుకున్నావా అంటూ భార్య రోదిస్తున్న తీరు అక్కడి వారి మనసుని కలచి వేసింది. చిన్నచిన్న కారణాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.