చైన్ స్నాచింగ్ లను అరికడతాం..! దృష్టి సారించిన ప్రత్యేక పోలీస్ బృందాలు..!!
హైదరాబాద్ : ఈసీ మనీ కి అలవాటు పడిన కొందరు యువకులు ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. బంగారు గొలుసు వేసుకున్న మహిళ కనిపిస్తే పాపం..! క్షణాల్లో ఆ గొలుసుని మాయం చేసేందుకు రెఢీ ఐపోతున్నారు కేటుగాళ్లు. నగరంలో వరసగా జరుగుతున్న గొలుసు దొంగలపట్ల మహిళలు తీవ భయబ్రాంతులకు గురౌతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక ఈ నేరాలను అదుపు చేయాలని పోలీసులు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. స్నాచర్లు వాడిన బైక్ పాత బస్తీలో అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా, అద్దెకు తీసుకున్నప్పుడు చూపించే వ్యక్తి గత వివరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. స్నాచర్లు ఏ రాష్ట్రానికి చెందిన వారు, విమానంలో నగరానికి చేరుకున్నారా, గూగుల్ సహాయంతో స్నాచింగ్ లకు పాల్పడుతున్నారా తదితర అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీసుస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజులుగా రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు..! ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..!!
ఖరీదైన కేటీఎం బైకు.. ఇద్దరు యవకులు.. ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు.. వెనుక కూర్చున్న వ్యక్తి ముఖానికి ముసుగు కట్టుకుంటాడు.. ఒంటరిగానో.. లేదా అమాయకంగా వెళ్లే మహిళలే టార్గెట్.. వారికి దగ్గరగా వచ్చి బైకును నిదానం చేస్తారు.. వెనక ఉన్న ఉన్న వ్యక్తి కాలు కాస్త కింద భూమికి అనిస్తాడు.. అంతే మహిళ మెడలో పుస్తెలతాడు తెగిపోతుంది. క్షణాల్లో తాళిని తెంచడం.. బ్యాగులో వేసుకోవడం.. అక్కడి నుంచి ఊడాయించడం.. ఇదీ చైన్ స్నాచర్ల అరాచకం.
వరుస చైన్ స్నాచింగ్లతో భయం.. భయం..! బయటికి రావాలంటేనే వణికి పోతున్న మహిళలు..!
హైదరాబాద్ తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్లతో ఇద్దరు హడలెత్తిస్తున్నారు. పోలీసుల నిఘాను దాటుకుని రాష్ట్ర సరిహద్దులు దాటుకుని వచ్చి బంగారం వేసుకున్న మహిళలే టార్గెట్గా చేసుకుని చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బుధవారం అయిదుచోట్ల చైన్ స్నాచింగ్లు జరగగా.. గురువారం ఉదయం మరోసారి హైదరాబాద్లో చైన్స్నాచర్లు విరుచుకుపడ్డారు. వనస్థలిపురం సహారా స్టేట్స్, ఎల్బీనగర్ టెలీఫోన్కాలనీలోనూ దొంగలు మహిళల నుంచి బంగారు పుస్తెలతాడు, చైన్లు తెంపుకుని పారిపోయారు.
ఎన్కౌంటర్ తో తగ్గిన స్నాచింగ్ లు..! మళ్లీ రెచ్చి పోతున్న దొంగలు..!!
దాదాపు రెండేళ్ల కిందట స్నాచింగ్ ముఠాలు విపరీతంగా హదరాబాద్లో రెచ్చిపోయేవి. తర్వాత పోలీసులు వారిని పట్టుకుని జైలుకు పంపడం, పీడీ యాక్టు నమోదు చేయడం చేశారు. రెండేళ్లుగా హైదరాబాద్లో చైన్ స్నాచింగులు బాగా తగ్గాయి. మళ్లీ ఒక్కసారిగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అదీ పూర్తిగా ఎల్బీనగర్ ప్రాంతంలోనే కావడం విశేషం. మూడు గంటల వ్యవధిలో అయిదుచోట్ల ఇద్దరు బైకుపై వచ్చి మహిళలమెడలతో బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు.
పాత బస్తీలో అద్దెకు తీసుకున్న బైక్..! కేసును ఛేదించే దిశగా పోలీసులు..!
మీర్పేట టీచర్స్కాలనీ, ఎల్బీనగర్లో అనుపమనగర్, వనస్థలిపురం, ఎన్జీవోకాలనీ, భాగ్యలత కాలనీల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. వీరి చైన్ స్నాచింగ్ శైలి చూసి ఇరానీ ముఠా లేదా పార్ఠీ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలు బంగారం వేసుకుని బయటకు రావాలంటే మరోసారి హడలెత్తిపోవాల్సిన పరిస్థితి. అదీగాక బాధిత మహిళలందరూ మధ్య వయస్కులే కావడం మరో విశేషం. వీరైతే గట్టిగా ప్రతిఘటించలేరని, ఎక్కువ దూరం పరిగెత్తలేరని తెలుచుకుని చోరీలకు పాల్పడ్డారు. అయిదుచోట్ల బుధవారం రాత్రి జరిగిన చోరీల్లో 19 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసుల లెక్కతేల్చారు. స్నాచింగ్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. సీసీ టీవీ ఫుటెజీలను విడుదల చేశారు. నగరు మహిళలు భయ బ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు.