రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్.. త్వరలో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా: ఈటల రాజేందర్
ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో కూడా తెలంగాణ ప్రభుత్వం తనదైన ముద్ర వేసిందని చెప్పారు. ప్రతి రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
త్వరలో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా టీకా పంపిణీ చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చక్కగా జరుగుతోందని వివరించారు. వ్యాక్సిన్ల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రికార్డు ఉందని ఈటల చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అన్ని స్థాయు ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు.
తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా టెస్టులను ప్రతి రోజు వేల సంఖ్యలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ఆర్టీపీసీఆర్ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. స్వాబ్ టెస్టుల ఫలితం నెగటివ్ వచ్చిన లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అక్కడ కూడా ఏమీ తేలకుంటే చెస్ట్ స్కాన్ చేస్తారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేయగా.. నిర్మల్లో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళే ఆయన చనిపోగా.. చనిపోలేదని మంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.