ఎన్ని మీటింగులైనా..ఎవరెన్ని చెప్పినా.. సీఎం తలుచుకున్నా..థియేటర్లు ఓపెన్ అయ్యేది అప్పుడే..!
హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి వల్ల వ్యవస్థలన్నీ కుప్పకూలినట్టే సినీ పరిశ్రమ, సినిమా థియేటర్లు, మాల్స్ ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారయ్యింది. థియేటర్లు, మల్టీప్రెక్స్ లు ఆర్ధికంగా చాలా చితికిపోయిన పరిస్థితులు నెకొన్నాయి. మాల్స్ తో పాటు సినిమా థియేటర్లలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ ప్రశ్నార్థకంగా తయారయినట్టు తెలుస్తోంది. పని లేదు జీతం లేదు అనే సిద్దాంతం దిశగా థియేటర్ యాజమాన్యాలు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొన్ని లక్షల మందికి జీవనోపాది మృగ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలనే మెగాస్టార్ చిరంజీవి అందరి కంటే ముందుగా చొరవ తీసుకుని థియేటర్ల పునఃప్రారంభం, షూటింగుల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులో చర్చలు జరిపారు.
షాకింగ్: క్యాబ్ డ్రైవర్పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?
షూటింగ్ లు ఓకే.. థియేటర్స్ తెరవడం ఇప్పుడే వద్దన్న టీ సర్కార్..
తెలంగాణలో రెక్కాడితే గాని డొక్కడని శ్రామిక ప్రజలు చాలా మందే ఉన్నారు. కరోనా వైరస్ వీరి లెక్కలను కూడా నిర్ధారించింది. సిని పరిశ్రమతో పాటు, మాల్స్, థియేటర్స్ లో పనిచేసే లక్షలాది మంది వారి సాధారణ జీవనం కోసం ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షల నుండి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రంగాలలో వినోదానికి సంబంధించిన వ్యవస్ధలు కూడా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో జీవనోపాది కోల్పోయిన సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడులా సహాయ పడ్డారు. కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో నిధులను సమీకరించి ఉపాది కోల్పోయిన 15వేల మంది కార్మికులకు చిరంజీవి ఆపన్న హష్తం అందించారు. తాజాగా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభమైతే మిగిలవారి జీవితాలు కూడా గాడిలో పడతాయని పరితపిస్తున్నారు మెగాస్టార్. అందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు చిరంజీవి.
షూటింగ్ లు, థియేటర్ల పై టీ సర్కార్ తో సుధీర్ఘ చర్చ.. చొరవ తీసుకున్న చిరంజీవి..
సినీ కార్మికుల సంక్షేమం కోసమే కాకుండా జీవనోపాది కోసం సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి మెగాస్టార్ ప్రాతినిధ్యం విహిస్తున్న విషయం కూడా తెలిసిందే. షూటింగ్ నిర్వహించుకునేందుకు సినీ పెద్దలు చేసిన ప్రయత్నాలు కొంతవరకూ సానుకూల ఫలితం ఇచ్చినా థియేటర్ల పునఃప్రారంభం గురించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. షూటింగుల విషయంలో సినీ ప్రముఖులు జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలిచ్చినప్పటికి సినిమా హాళ్ల అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షూటింగ్ లు తిరిగి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సానుకూలంగా ఉండటంతో చర్చలు థియేటర్ల వైపు మళ్లింది. అసలు సమస్య ఇక్కడే మొదలైనట్టు తెలుస్తోంది.
షూటింగులతొ సమస్య లేదు.. సినిమా థియేటర్లతోనే సమస్య అంటున్న తెలంగాణ ప్రభుత్వం..
సినీ ప్రముఖుల కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు అనుమతిచ్చింది. ఐతే ఆ షూటింగులకు సంబందించిన సన్నివేశాలను వెండితెర మీద చూసేదెప్పుడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం ఒకటే కాకుండా వాటిని ప్రదర్శించటానికి థియేటర్లకు సైతం అనుమతిస్తేనే దాని లక్ష్యం ఛేదించినట్టవుతుంది. కాని ఇక్కడ పరిస్థితులు పరస్పరం విరుద్దంగా కనిపిస్తున్నాయి. సినిమా థీయేటర్లు ప్రారంభం కావడనికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంత ఆసక్తిగా లేదనేది స్పష్టమవుతోంది.
అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు నుండి వెండితెర ఓపెన్.. మార్గదర్శకాలు సిద్దం చేస్తున్న టీ సర్కార్..
అన్నింటికన్నా ముందు థియేటర్లలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఆ తర్వాత అందుకు అనుగుణంగా థియేటర్లలో మార్పులు చేసుకోవడానికి కొంత సమయం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే, థియేటర్ యాజమాన్యాలు అందుకు సహకరిస్తే ఆగస్టు మొదటి వారం నుండి థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా భావించినట్టు ఈ ఏడాది చివరి వరకూ థియేటర్లు తెరిచే అవకాశం లేదన్న వాదన సరికాదని వివరణ ఇచ్చారు సినీ ప్రముఖులు. వేలాది కోట్ల టర్నోవర్ ఉండే సినిమా పరిశ్రమ స్తబ్దుగా మారితే లక్షలాది మంది ఉపాదికి గండి పడుతుందని, అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. సినీ ప్రముఖుల ద్వారా వచ్చిన ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని థియేటర్లు పునఃప్రారంభించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయి.