లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్యారడైజ్ బిర్యానీ: ఏడాదిలో 70 లక్షలు, రోజుకు 19వేల బిర్యానీలు
హైదరాబాద్: భాగ్యనగరంలోని ప్యారడైజ్ హోటల్కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారడైజ్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కు వచ్చినవారు ఇక్కడి బిర్యానీని రుచి చూసి వెళ్లాలనుకుంటారు. తాజాగా, ప్యారడైజ్ బిర్యానీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది.
ఒక ఏడాదిలో (2017) అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఒక ఏడాదిలోనే (ఒక కేలండర్ ఇయర్) 70 లక్షలు పైగా బిర్యానీలు సర్వ్ చేసింది. ఇందుకు గాను ప్యారడైజ్ ఈ అవార్డును సొంతం చేసుకుంది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు బెస్ట్ బిర్యానీ అవార్డు
లిమ్కా బుక్ అవార్డుతో పాటు బెస్ట్ బిర్యానీ అవార్డు కూడా లభించింది. ప్యారడైజ్ ఛైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
విదేశాల్లో ప్యారడైజ్ బ్రాంచీలు
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవార్డుతో తమ బాధ్యత పెరిగిందని సంస్థ ఛైర్మన్ అలీ హేమతి అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 ప్యారడైజ్ బ్రాంచీలు ఉన్నాయని, త్వరలో ఇతర దేశాల్లోనూ ప్రారంభిస్తున్నామని చెప్పారు. నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగి కృషి వల ఈ ఘనత దక్కిందని ప్యారడైజ్ సీఈవో గౌతమ్ గుప్తా అన్నారు.
ఏడాదిలో 70 లక్షలు, రోజుకు 19వేలకు పైగా బిర్యానీలు
2017 జనవరి 1వ తేదీ నుంచి 2017 డిసెంబర్ 31వ తేదీ వరకు ప్యారడైజ్ హోటల్లో 70,44,289 బిర్యానీలు సర్వ్ చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఇన్ని బిర్యానీలు రికార్డ్. ఈ లెక్కన చూస్తే ఒక రోజుకు 19,352 బిర్యానీలు, గంటకు 806 బిర్యానీలు, నిమిషానికి 13 బిర్యానీలు సర్వ్ చేసినట్లుగా లెక్క.