కిలాడీ లేడీ : ప్రేమించి మోసపోయింది.. ఓఎల్ఎక్స్ వేధికగా మోసాలు చేసి బ్రతికేస్తోంది...!
హైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి హైదరాబాద్ కు చేరిన యువతి మోసపోయింది. ప్రేమికుడి నయవంచనతో అటు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేక, జీవన పోరాటానికి మోసాల బాట ఎంచుకుంది. దొంగలా మారి చివరకు పోలీసులకు చిక్కింది.
ప్రేమికుడి మోసం.. దొంగలా మారిన వైనం
గుంటూరుకు చెందిన 24 ఏళ్ల అరవింద, ప్రేమికుడి మాయమాటలతో హైదరాబాద్ చేరుకుంది. కొన్నిరోజులు గడిచాక ముఖం చాటేశాడు సదరు మోసగాడు. కన్నవారికి తన ముఖం చూపించలేక నగరంలోనే ఉంటూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేసింది. ఆ సంస్థలో పరిచయమైన ఓ మహిళ ద్వారా ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టే ఫోన్లను ఎలా కొట్టెయ్యచ్చో తెలుసుకుంది.
ఖరీదైన ఫోన్లకు ఎసరు
అలా మార్చి నెల నుంచి మోసాలకు శ్రీకారం చుట్టింది అరవింద. ఓఎల్ఎక్స్లో పెట్టే ఖరీదైన ఫోన్లు కొట్టానంటూ సదరు యజమానులకు ఫోన్ చేసేది. వారిని ఫలానా అడ్రస్ కు రావాలంటూ లొకేషన్ షేర్ చేసేది. తీరా వారు వచ్చాక ఛార్జింగ్ చెక్ చేస్తానంటూ లోనికి వెళ్లి మాయమయ్యేది. ఆమె కోసం ఆ ఇంటి గేటు దగ్గరే నిరీక్షించేవారు. కాసేపయ్యాక ఆమె కోసం ఆరా తీస్తే అలాంటివారు అక్కడ ఎవరూ లేరనే సమాధానం వచ్చేది.
ఈ ఇల్లు మాదే.. ఇక్కడే ఉండండి..!
ఫోన్ల కోసం ఎవరికైతే కాల్ చేసేదో, వారు రావడానికంటే ముందే పెద్ద స్కెచ్ వేసేది అరవింద. ఎవరూ లేని ఓ ఇంటిని సెలెక్ట్ చేసుకునేది. అది కూడా బ్యాక్ డోర్ నుంచి సులువుగా తప్పించుకునే వీలుండే ఇళ్లనే ఏరికోరి సెలెక్ట్ చేసుకునేది. అంతా ఓకే అనుకున్నాక.. సదరు ఫోన్ల యజమానులకు లొకేషన్ షేర్ చేసేది.
తీరా వారు వచ్చాక ఛార్జింగ్ చెక్ చేస్తా, లోనికి వెళ్లి డబ్బులు తెస్తానంటూ వెనుక డోర్ నుంచి తప్పించుకునేది. వచ్చినవారు ఆమె కోసం చూసి చూసి ఇరుగు పొరుగన ఎంక్వైరీ చేస్తే అలాంటివారు ఇక్కడ ఎవరూ ఉండరనే సమాధానం వచ్చేది. దాంతో తాము మోసపోయామని గుర్తించేవారు.
సైకిల్కు ఓటేయ్యమని చెప్తావా?.. పోలింగ్ అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి (వీడియో)
ఎక్కడైతే దొంగిలింపబడ్డాయో.. అక్కడే అమ్మకం
ఒక్కోసారి ఒక్కో ఇల్లును సెలెక్ట్ చేసుకునే కిలేడీ అరవింద పలు జాగ్రత్తలు తీసుకునేది. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేది. అలా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలువైన మూడు ఫోన్లను చాకచక్యంగా కొట్టేసింది. దాదాపు 2 లక్షల 20 వేలు ఖరీదు చేసే ఫోన్లను తస్కరించింది. సైదాబాద్ పీఎస్ పరిధిలో ఇలాంటి చోరీకి పాల్పడింది.
అలా దొంగిలించిన ఖరీదైన ఫోన్లను తిరిగి ఓఎల్ఎక్స్లోనే అమ్మకానికి పెడుతోంది అరవింద. వాటి ద్వారా వచ్చిన క్యాష్ తో జల్సాలు చేస్తోంది. అయితే చోరీ చేసిన ప్రతిసారి సిమ్కార్డులు మార్చేస్తోంది. మొత్తానికి తెలివిగా తప్పించుకుంటున్నానని భావించిన అరవింద చివరకు పోలీసుల చేతికి చిక్కింది.