కోయిలమ్మ సీరియల్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు... రాయదుర్గం పోలీసులకు యువతి ఫిర్యాదు
'కోయిలమ్మ' సీరియల్ నటుడు అమర్ శశాంకపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్లోని మణికొండకు చెందిన ఓ యువతి అమర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్న అమర్... ఆ డబ్బును తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయంపై అతన్ని ప్రశ్నించినందుకు తాగి ఇంటికొచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డాడని పేర్కొంది.
తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు లైంగికంగా వేధించాడని తెలిపింది. అమర్తో పాటు ముగ్గురు ఆకతాయిలు,అతని గర్ల్ఫ్రెండ్ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. శ్రీవిద్యతో పాటు అపర్ణ అనే మరో యువతి కూడా శశాంకపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాలు కూడా ఈ ఫిర్యాదుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. అమర్ కూడా శ్రీవిద్యపై కౌంటర్ కేసు పెట్టినట్లు సమాచారం. ఇరువురి ఫిర్యాదులపై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇటీవల టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడిపై కూడా శ్రీసుధ అనే నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్ కె నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. శ్రీసుధ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మే 26న శ్రీసుధ మొదటిసారి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా శ్యామ్ కె.నాయుడు బెయిల్ పొందారని రెండోసారి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో ఆయన బెయిల్ కూడా రద్దయింది.