పంజాగుట్ట సెంటర్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళ..
కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుండగా.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట సెంటర్ లో దారుణం జరిగింది. జరిగింది. మంగళవారం సాయంత్రం అందరూ చూస్తుండగా ఓ మహిళ.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకుంది.
సరిగ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందే మహిళ ఆత్మాహుతికి ప్రయత్నించడం కలకలం రేపింది. కాలిపోతున్న మహిళలను గుర్తించిన వెంటనే పోలీసులు బ్లాంకెట్ కప్పి, నీళ్లు చల్లి మంటల్ని ఆర్పేశారు. కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఆత్మాహుతికి ప్రయత్నించిన ఆ మహిళ వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సిఉంది. ఆమె కేసు నిమిత్తం వచ్చిన వ్యక్తా, ఎవరా అనేది తెలియాల్సి ఉంది. మహిళ వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆమెకు సంబంధించినవాళ్లెవరో కనిపెట్టేపనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.
రద్దీగా ఉండే రోడ్డు పక్కనే ఉండటంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అయినాసరే మహిళ పెట్రోల్ తో లోనికి వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఏడాది కిందట సిటీలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా సరిగ్గా ఇలాగే ఓ మహిళ ఆత్మాహుతికి ప్రయత్నించగా పోలీసులు కాపాడారు.