ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు "ఫిర్యాదు"..!
హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పోస్టులు జుగుప్సకరంగా ఉంటున్నాయి. కొందరేమో పగ సాధించుకునేలా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా సోషల్ మీడియా ద్వారా బలవుతున్న ఘటనలు అనేకం.
జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పట్ల అసభ్య ప్రచారం చేస్తున్నారంటూ.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యక్తిగత జీవితం పట్ల సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నవారి భరతం పట్టాలని కోరారు. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా ఇష్టారాజ్యంగా ఫోటోలు పెట్టడం, కామెంట్లు రాయడం నిత్యకృత్యమైందని ఆరోపించారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ప్రియాంకగాంధీసౌ పదుల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు, కార్టూన్లు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.