ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!
హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. సామాన్యుడు విదిల్చిన బాణానికి ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది. నో పార్కింగ్ జోన్ లో తన వాహనం పార్కింగ్ చేసినందుకు.. ప్రథమ పౌరుడు ఫైన్ కట్టక తప్పలేదు.
రాంగ్ పార్కింగ్.. మేయర్ కు ఫైన్
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు ఊహించని అనుభవం ఎదురైంది. రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆయనపై ఓ సామాన్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశమైంది. హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలోని నో పార్కింగ్ జోన్ లో మేయర్ కారు పార్క్ చేశారంటూ.. ఒకతను ఫోటో తీసి పోలీసు ఉన్నతాధికారులకు ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ విభాగానికి రీ ట్వీట్ చేశారు. రంగంలోకి దిగిన సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బొంతు రామ్మోహన్ వాహనానికి చలానా విధించారు. రెండు మూడు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
రాంగ్ పార్కింగ్ తప్పే..!
రాంగ్ పార్కింగ్ విషయంలో మేయర్ బొంతు రామ్మోహన్ పై నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిసింది. మేయర్ తీరును నెటిజన్లు తప్పుపట్టారు. దీనిపై స్పందించిన మేయర్.. రాంగ్ పార్కింగ్ తప్పేనంటూ హుందాగా అంగీకరించారు. అయితే అది తనకు తెలియకుండా జరిగిందని చెప్పుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా నిలదీసే పరిస్థితులు రావడం అభినందనీయమంటూ వ్యాఖ్యానించారు.
ఫైన్ కడతా..!
చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు బొంతు రామ్మోహన్. రాంగ్ పార్కింగ్ విషయంలో తనకు విధించిన జరిమానా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తాను ఎంతోమందికి జరిమానాలు విధించిన సంగతుల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎంతటి స్థాయిలో ఉన్నా.. చట్టాలను, నియమ నిబంధనలను పాటించాల్సిందేనంటూ పేర్కొన్నారు. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం పెరగడం హర్షణీయమన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నిబంధనలు అతిక్రమించేవారిపై కూడా ఇలాగే ప్రశ్నించే తత్వం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.