యువకుడి అవిటితనానికి మీరే కారణం..! 10లక్షల నష్టపరిహారం చెల్లించండి..!!
హైదరాబాద్: వైద్య వ్రుత్తిలో అప్రమత్తంగా ఉండక పోతే ఎలాంటి నష్టం జరుగుతుందొ నిమ్స్ వైద్యులకు తెలిసొచ్చేలా చేసాడు ఓ యువకుడు. చికిత్సలో నిర్లక్ష్యంతో కాలు కోల్పోయిన బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసి విజయం సాధించాడు. బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)ను ఆదేశిస్తూ హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 తీర్పునిచ్చింది. సనత్నగర్లోని ఫతేనగర్ ఇందిరాగాంధీపురానికి చెందిన అంజద్ అలీఖాన్కు రక్త క్యాన్సర్ ఉన్నట్లు ఎర్రగడ్డలోని ఓ ఆసుపత్రి వైద్యుడు చెప్పడంతో చికిత్స కోసం 2012 జులై 16న నిమ్స్లో చేరాడు. క్యాన్సర్ను నిర్ధారించేందుకు ఎముక గుజ్జును బయాప్సీ పరీక్ష చేయాలని అక్కడి వైద్యులు చెప్పారు. బయాప్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అంజద్కు ఇంజక్షన్ చేశారు. ఆ తర్వాత బాధితుడి కుడి కాలుకు పక్షవాతం వచ్చింది. కాలు కదపలేని పరిస్థితి నెలకొంది.
కుటుంబాన్ని పోషించాల్సిన అంజద్ ఉద్యోగం కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 10 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3ను ఆశ్రయించాడు. ఇరువర్గాల వాదనలు విన్న ఫోరం, నిమ్స్ యాజమాన్యం 10 లక్షల రూపాయల పరిహారాన్ని 15 వేల రూపాయలను ఖర్చులతో కలిపి అంజద్కు చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే, నిమ్స్ వైద్యులు, సిబ్బంది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా తీసుకున్న నేపథ్యంలో వారు చేసే ఎలాంటి పనులకైనా సదరు సంస్థ నష్టపరిహారం అందిస్తుందని నిమ్స్ ప్రతినిధి వాదించారు. దీంతో ఈ మొత్తాన్ని నిమ్స్ తరఫున ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది.