టీడీపీ రెండో ఇన్నింగ్స్కు ఆదిలోనే దెబ్బ.. కీలక నేత గుడ్బై.. తెలంగాణలో పునర్ వైభవం సంగతేంటో?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన టీడీపీ అగ్ర నాయకత్వానికి ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆ పార్టీ సీనియర్ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబు పునరాలోచనకు ఇది పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు.
ఉమ్మడి ఏపీలో టీడీపీ హవా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన పేజీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ లేని సమయంలో ఆనాడు అన్న ఎన్టీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన టీడీపీ తెలుగు ప్రజలకు దగ్గరైంది. ఉమ్మడి ఏపీలో చాలాకాలం పాటు అధికారంలో ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు టీడీపీ హవా తగ్గుతూ వచ్చింది. కారు జోరుకు సైకిల్ ఢీలా పడింది. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రాంతంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ టీడీపీకి పునర్వైభవం కష్టమేనా?
2014లో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సారించారు. ఇక్కడ తెలంగాణ టీడీపీకి ఎల్.రమణను అధ్యక్షుడిగా చేసినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పార్టీ మనుగడ కష్టంగా మారింది. క్యాడరంతా టీఆర్ఎస్ వైపో.. బీజేపీ వైపో చూడటంతో సైకిల్ పూర్తిగా పంక్చర్ అయినట్లైంది. అయితే మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు నాయుడు తన దృష్టిని తెలంగాణపై పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఏలాగూ ఐదేళ్లు పెద్దగా పని ఉండని కారణంగా తెలంగాణ టీడీపీకి పునర్వైభవం తేవడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
హుజుర్నగర్ ఉప ఎన్నిక ద్వారా సెకండ్ ఇన్నింగ్స్
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపిన టీడీపీ మహా కూటమిగా టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే కారు జోరుకు మహా కూటమి పప్పులు ఉడకలేదు. అదలావుంటే హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు చంద్రబాబు. ఆ మేరకు టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే హుజుర్నగర్ ఉప ఎన్నిక ద్వారా టీడీపీ ఉనికి చాటి తెలంగాణలో పార్టీకి మళ్లీ పునర్వైభవం తెస్తామని ప్రకటించారు చంద్రబాబు.
ఆదిలోనే పెద్ద దెబ్బ.. యువ నేత గుడ్బై
తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం ఏమో గానీ.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ వేళ ఆదిలోనే దెబ్బ తగిలింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ గట్టి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్బై చెబుతూ రాజీనామా చేశారు. ఆ మేరకు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి.. తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను చంద్రబాబు నాయుడికి పంపించారు.
హుజుర్నగర్లో బామ్మ పోటీ.. ఎమ్మెల్యే ఎన్నికలకు సై.. ఎందుకో తెలుసా?
టీడీపీ సిద్దాంతాలు పణంగా పెడుతోందని..!
రాజకీయ అవసరాల కోసం టీడీపీ భిన్నంగా వ్యవహరిస్తోందని.. సిద్దాంతాలను పణంగా పెడుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు వీరేందర్ గౌడ్. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రస్తుత తరుణంలో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడమనేది జీర్ణించుకోలేక పోతున్నట్లు అందులో రాశారు. అయితే టీడీపీని వీడిని ఈ యువ నాయకుడు అక్టోబర్ 3వ తేదీన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది.
పార్టీకి గుడ్బై.. బీజేపీలో చేరతారా?
దేవేందర్ గౌడ్ తనయుడిగా టీడీపీలో చేరిన వీరేందర్ గౌడ్ పార్టీలో తనదైన ముద్ర వేశారు. అదలావుంటే ఎమ్మెల్యే కావాలనే తన కల ఇంతవరకు నెరవేరకపోవడం ఆయన్ని నిరాశకు గురిచేసినట్లుగా కనిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ సెగ్మెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ క్రమంలో చంద్రబాబు సూచన మేరకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి అయిష్టంగానే పోటీ చేసి ఓడిపోయారు. అయితే మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ దక్కించుకోవడానికి ఆయన పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. చివరకు మహా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచినా.. కారు జోరుకు ఓటమి చవి చూడక తప్పలేదు.