ప్రాణం తీసిన పరుగు.. పోలీస్ ఉద్యోగ వేటలో యువకుడు దుర్మరణం
ఇబ్రహీంపట్నం : మీ కొడుకు చేతికి అందివచ్చాడు. మీకేం కాదు, సమస్యలు అన్నీ తీరిపోతాయి... ఇదీ ఇరుగుపొరుగు మాట. అమ్మా నాన్న.. ఈసారి పోలీస్ జాబ్ కొడతా. ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా.. ఇదీ కొడుకు మాట. అయితే అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఉద్యోగ వేటలో పరుగు పెట్టిన ఆ యువకుడు ఆకస్మాత్తుగా తనువు చాలించాడు. పోలీస్ ఉద్యోగానికి ఎంపికయి పరుగు పందెంలో అర్హత సాధించే క్రమంలో "రన్నింగ్ ప్రాక్టీస్" అతడిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేటిళ్ల గ్రామానికి చెందిన గుంటి ఏకాంబరం (23సం.) పీజీ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన ఏకాంబరం.. ఫిజికల్ టెస్టుకు సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఈనెల 23న ఈవెంట్స్ జరగనున్నాయి. ఆ క్రమంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం నాడు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించడమే శ్వాసగా ముందుకు సాగిన ఏకాంబరం.. అదే క్రమంలో ఊపిరి వదలడం స్థానికంగా విషాదం నింపింది. సరిగ్గా కల సాకారమయ్యే సమయంలో అతడు మృత్యువాత పడటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకాంబరం తండ్రి యాదయ్య.. ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన తమ కొడుకుకు ఎలాగైనా ఉద్యోగం వస్తుందని.. తమ కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. చెట్టంత కొడుకును పొగొట్టుకుని కన్నీటిసంద్రమైన ఏకాంబరం తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు.