అదే కారణం.. సికింద్రాబాద్ మైనర్ బాలిక హత్య కేసును చేధించిన పోలీసులు..
చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్టు చేశామని నార్త్జోన్ డీసీపీ కమలేశ్వర్ వెల్లడించారు. ఇర్ఫానా తనకు దక్కకుండా పోయిందన్న కసితోనే స్నేహితుడు షోయబ్ ఆమెను హతమార్చినట్టు తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం.. ఇర్ఫానా, షోయబ్ గతంలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో షోయబ్ ఇర్ఫానాపై ఇష్టం పెంచుకున్నాడు. ఆమెతో వివాహం జరిపించాలని గతంలో ఆమె తల్లిదండ్రులను కూడా కోరాడు. అయితే అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇర్ఫానాపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని, ఆమెను హతమార్చాలనుకున్నాడు.
ఇదే క్రమంలో ఇద్దరూ వాట్సాప్లో బుధవారం రాత్రి చాటింగ్ చేసుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో టెర్రస్పైకి రావాలని షోయబ్ మెసేజ్ పెట్టడంతో ఆమె అక్కడకు వెళ్లింది. కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన షోయబ్.. ఆ తర్వాత అక్కడే ఉన్న బండరాయితో యువతిపై దాడిచేశాడు. పదునైన రాయితో ఆమె గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని బిల్డింగ్ పైనుంచి తోసేశాడు.
మరుసటి రోజు ఉదయం వారాసిగూడలో భవనంపై నుంచి పడి ఓ యువతి రక్తపు మడుగులో ఉందని తమకు సమాచారం అందినట్టు డీసీపీ తెలిపారు. మృతురాలు ఇర్ఫానా కుటుంబ సభ్యులను విచారించి ఆధారాలు సేకరించారు. షోయబ్ అనే యువకుడిపై వారు అనుమానం వ్యక్తం చేయడంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతను నేరం అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.