రెండోరోజు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష..కంటిన్యూ: తెల్లవారు జాము నుంచే దీక్షా శిబిరంలో
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. నిర్వహించ తలపెట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. లోయర్ ట్యాంక్బండ్లోని ఇందిరాపార్క్ వద్ద ఒక్కరోజు మాత్రమే నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ లోటస్పాండ్లోని తన నివాసం వద్ద ఆమె దీక్షను కొనసాగిస్తున్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్ కోసం..
లోటస్పాండ్ నివాసం వద్ద తాత్కాలికంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు ఆమె దీక్షకు కూర్చున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల తరఫున వైఎస్ షర్మిల నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,100 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ విడుదల చేయాలనేది ఆమె ప్రధాన డిమాండ్. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు దీక్షా శిబిరాన్ని కొనసాగించాలని ఆమె తొలుత భావించారు. దీనికోసం సెంట్రల్ జోన్ పోలీసుల అనుమతి కోరారు.
దీక్ష.. పాదయాత్ర భగ్నం..
కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ జోన్ పోలీసులు షర్మిల పార్టీ నాయకులు కోరిన విధంగా మూడు రోజుల పాటు దీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. ఒక్కరోజుకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి అనుగుణంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి ఆమె దీక్ష కొనసాగింది. ఇంటి వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెబుతూ పాదయాత్రగా తన నివాసానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె పాదయాత్రను భగ్నం చేశారు. అరెస్ట్ చేశారు.
రాత్రి లోటస్పాండ్లో దీక్ష కొనసాగింపు..
ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటలో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైంది. ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కొన్ని గంటల తరువాత పోలీసులు ఆమెను విడుదల చేశారు. ఆ తరువాత కూడా పొద్దుపోయేంత వరకూ షర్మిల తన నివాసంలో దీక్షకు కూర్చున్నారు. తల్లి విజయమ్మ, పార్టీ నాయకులు తోడుగా దీక్షను కొనసాగించారు. దీక్షలో ఉన్న సమయంలోనే డాక్టర్ ఆమె చేతికి కట్టు కట్టారు. తన పాదయాత్ర సందర్భంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగుల, యువతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెల్లవారు జామునే దీక్షా శిబిరంలో
మిగిలిన రెండో రోజుల దీక్షను కూడా కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేయడంతో పార్టీ నాయకులు అప్పటికప్పుడు లోటస్ పాండ్ ఆవరణ బయట తాత్కాలికంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారు జామునే వైఎస్ షర్మిల.. దీక్షా శిబిరంలో కూర్చున్నారు. వైఎస్ఎస్ఆర్ ఉద్యోగ దీక్ష అనే పేరుతో ఆమె నిరహార దీక్షను చేపట్టారు. దీన్ని కొనసాగించడానికి అనుమతి లేకపోవడం వల్ల మరోసారి పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసే అవకాశాలు లేకపోలేదు.
ప్రజా సంఘాలు మద్దతు..
పార్టీ నాయకులు, కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న, పిట్టా రామ్రెడ్డి వంటి పలువురు నేతలు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, కంచె ఐలయ్య షర్మిల దీక్షకు మద్దతు ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన శిబిరంలో పాల్గొన్నారు. రెండో రోజు ఇంటి వద్ద కొనసాగిస్తోన్న దీక్షా శిబిరానికి మరికొందరు ప్రజా సంఘాల నాయకులు చేరుకోవచ్చని తెలుస్తోంది. నిరుద్యోగ సమస్య కోసం పోరాడుతోన్న వేర్వేరు సంఘాలన్నీ షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.