తండ్రి బాటకు భిన్నంగా: షర్మిల పార్టీ పేరు మారుతోందా?: రెండు కొత్త పేర్లు: ప్లేస్, డేట్ ఫిక్స్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోన్నారు వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అవుతోన్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా, సానుభూతిపరులుగా ఉంటోన్న వారితో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోన్న ఆమె.. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. వచ్చేనెలలో పార్టీ పేరును ప్రకటించబోతోన్నారు. ఈలోగా అన్ని జిల్లాలకు చెందిన అభిమానులతో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఫిక్స్: ఆ రెండు తేదీలపై చర్చ: జెండా, అజెండా రూపకల్పనలో
ఖమ్మంలో..వచ్చేనెల 9న
అందరూ ఊహించినట్లుగా ఆమె తన తండ్రి బాటలో నడవట్లేదు. తొలుత- వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్లలో షర్మిల పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని భావించారు. దీనికి భిన్నంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఖమ్మంలో పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించే భారీగా బహిరంగ వేదికగా తన రాజకీయ రంగప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు.. పార్టీ పేరును వెల్లడిస్తారని సమాచారం.
వైఎస్సార్టీపీకి ప్రత్యామ్నాయంగా..
వైఎస్ షర్మిల నెలకొల్పబోయే పార్టీ పేరు- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రచారంలో ఉంది. ఆత్మీయ సమావేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే ఈ పేరు ప్రచారంలోకి వచ్చింది. విస్తృతంగా జనంలోకి వెళ్లింది. తమ పార్టీ పేరు ఇదేనంటూ షర్మిల గానీ, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి గానీ ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా- ఈ పేరును మార్చాలని షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె పరిశీలనలో రెండు కొత్త పేర్లు ఉన్నాయని అంటున్నారు. వైఎస్ఆర్టీపీ లేదా రాజన్న రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలిస్తోన్నారని సమాచారం. అభిమానుల సూచనల మేరకే పార్టీ పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ఖమ్మం ఎందుకు?
తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడానికి షర్మిల ఖమ్మంను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి- ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువసంఖ్యలో ఉన్నారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక లోక్సభ, రెండు శాసనసభ స్థానాలను గెలచుకుంది ఈ జిల్లాలోనే. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం, ఆంధ్రోళ్ల పార్టీ అనే ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ.. ఇక్కడ విజయం సాధించడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతోన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైసీపీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నందు వల్లే ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఖమ్మాన్ని ఎంచుకున్నట్లు అంచనా వేస్తోన్నారు.
షర్మిలకు మద్దతు..
తెలంగాణలో షర్మిలకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల నెలకొల్పబోయే పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన వారు.. షర్మిల ప్రకటించబోయే పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తోన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కొందరు ప్రముఖులు కూడా పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో స్థిరపడి, ఆ నగరాన్ని వదిలి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడని ప్రముఖులు.. షర్మిల పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.