వైఎస్ షర్మిల పార్టీ: పోడు భూములే ఎజెండా, ఖమ్మం గుమ్మం నుంచి ప్రజల్లోకి..
పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. తనతో వచ్చేవారు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో సమావేశంతో పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే ప్రజలతో మమేకమవుతానని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళలనంలో పాల్గొంటారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తర్వాత తొలి పర్యటన ఇదే కానుంది.
పోడు భూములు..
ఖమ్మంలో జరిగే సమావేశంలో చర్చించే అజెండా గురించి డిస్కష్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పోడు భూముల్లో పట్టాలివ్వడమే తొలిపోరుగా కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ షర్మిల పార్టీ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఆ నేత షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ప్రస్తావించిన పలు అంశాల్లో.. పోడు భూముల సమస్యపై చర్చించినట్టు తెలుస్తోంది.
బలం..
పోడు భూముల అంశాన్నే రాజకీయ ప్రస్థానంగా ప్రారంభించాలని షర్మిల అనుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ హవాలో కూడా ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. పినపాక నియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు వైసీపీ నుంచి విజయం సాధించారు. అందుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో వైఎస్ఆర్కు బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ను షర్మిల తన బలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది.
జిల్లా నేతలతో సమావేశం
రాజకీయ పార్టీ నిర్మాణం కోసం వివిధ జిల్లాల నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారు. నేతల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందుగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు, మాజీ సీఎం రాజశేఖర్రెడ్డి అభిమానుల సలహాలను కూడా తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పథకాలను తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. పార్టీ ఎజెండాలో కూడా చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.