ఫేక్ డాక్టర్: సర్టిఫికెట్లు పొంది ప్రాక్టీస్, పలు ఆస్పత్రుల్లో పని, కోవిడ్ కంట్రోల్ సెంటర్లో కూడా..
అతనో కేటుగాడు.. మాములు మాయగాడు కాదు. చదివింది అంతంతమాత్రమే.. కానీ మెడిసిన్ సర్టిఫికేట్ సాధించాడు. హైదరాబాద్లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కోవిడ్-19 కంట్రోల్ రూమ్లో వైద్యునిగా పనిచేశాడు. అతనిని ఎవరూ గుర్తించలేకపోయారు. కానీ భార్య మాత్రం ఆగడాలను గుర్తించింది. చేసే మోసాలు చూసి.. భరించలేకపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. ఆ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్ తేజ అలియాస్ ఫేక్ డాక్టర్..
వైఎస్ తేజ అలియాస్ తేజా రెడ్డి అలియాస్ అవినాశ్ రెడ్డి, అలియాస్ వీరగంధం తేజ (23) స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాటు మండలం బొడ్డువారిపాలెం. కానీ ప్రస్తుతం ఉంటోంది మాత్రం బౌడుప్పల్లోని వెస్ట్ బాలాజీ హిల్స్లో.. తేజ తండ్రి పేరు వీరగంధం వెంకట్రావు.. తేజ 5వ తరగతి వరకు చదువుకున్నాడు. 2005లో ఇంటి నుంచి పారిపోయి రైల్వేస్టేషన్లో ఉంటూ వాటర్ బాటిళ్లు అమ్ముకునేవాడు.
అతనికి ఎండునూరి సందింటి పురుషోత్తంరెడ్డి పరిచయం అయ్యాడు. తిరుపతిలో డాక్టర్గా పనిచేసే పురుషోత్తం రెడ్డి.. తేజను ఇంటికి తీసుకెళ్లారు. తిరుపతి రైల్వే క్యాంటిన్లో ఉపాధి కల్పించారు. 2008 నుంచి 2011 వరకు తేజ అక్కడ పనిచేశాడు. తర్వాత తన ఊరికి వెళ్లిపోయాడు. ఇక అక్కడ తన ఇంటి చిరునామాతో ఓటర్ గుర్తింపు కార్డు సంపాదించాడు. తన పేరును ఎండునూరి సందింటి తేజ రెడ్డిగా మార్చుకున్నాడు.
ఫేక్ సర్టిఫికేట్స్..
శ్రీనివాసరావు సహకారంతో భారతీయ విద్యా శిక్ష పరిషత్ లక్నో పేరుతో 10వ తరగతి, ఇంటర్ నకిలీ సర్టిఫికెట్స్ సంపాదించాడు. అందుకోసం రూ.లక్ష వరకు ముట్టజెప్పాడు. ఎంబీబీఎస్ సర్టిపికెట్ను రూ.5 లక్షలతో సంపాదించాడు. ఢిల్లీలో ఎస్ఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రణ్వీర్ సిన్హా సహకారంతో తీసుకున్నాడు. పండిట్ దీన్దయాళ్ మెడికల్ సైన్స్ కాలేజీ రాయ్పూర్ నుంచి 2010-2014 వరకు ఎంబీబీఎస్ చదివినట్లు సర్టిఫికేట్ సంపాదించాడు.బెంగళూరులోని సప్తగిరి ఆసుపత్రిలో జూనియర్ డీఎంవోగా 2016 వరకు పనిచేశాడు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారినంటూ చెప్పుకొని తిరిగి జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చాక కూడా బుద్ది మారలేదు.
బెంగళూర్ నుంచి హైదరాబాద్..
బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. అయితే ఇక్కడ డాక్టర్ అవినాశ్ రెడ్డిగా పేరు మార్చుకొని చలామణి అయ్యాడు. పలు ఆస్పత్రులలో పనిచేశాడు. లాక్డౌన్ సమయంలో వలంటీర్గా సేవలు అందిస్తానని చెప్పి రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్లో చేరాడు.మ్యాట్రిమోనీ సైట్లో యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను డాక్టర్ అంటూ బీడీఎస్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతని గురించి ఆమె తెలుసుకుంది. మోసగాడితో ఉండలేనని భావించి.. విడిగా ఉంటోంది. చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ వో టీ పోలీసులు తేజను అరెస్ట్ చేశారు. తేజ రెడ్డితోపాటు అతనికి సహకరించిన బోకుడి శ్రీనివాస రావు, తేజ తండ్రి వెంకట్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
కోవిడ్ కంట్రోల్ రూంలో పనిచేస్తూ.. అడ్డంగా దొరికి
రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూంలో పనిచేసే సమయంలోనే పోలీసులు తేజపై అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ తేజ కావడంతో.. ఏపీ సీఎం జగన్ తనకు తెలుసు అని చెప్పారు. దీంతోపాటు రౌడీ షీటర్ పేర్లతో ఉన్న వాహనాలకు పోలీసు స్టిక్కర్ అతికించడం గమనించారు. అతన్ని ఓ కంట కనిపెడుతుండగానే.. భార్య ఫిర్యాదు వచ్చింది. దీంతో తాము ఊహించింది నిజమేనని భావించి.. అరెస్ట్ చేశారు. అతని నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్, కాన్వొకేషన్ సర్టిఫికేట్, టెన్త్, ఇంటర్, ఎంబీబీఎస్, బీబీఏ, ఎంబీఏ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్స్ కూడా సీజ్ చేశారు.