వైఎస్ విగ్రహాలపై దాడి శోచనీయం, దుండగులపై చర్యలు తీసుకోండి: గట్టు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభంలోనే ఇబ్బంది పెట్టాలని వైయస్ఆర్ విగ్రహాలపై కొంత మంది దుండగులు దాడులు చేస్తున్నారు. ధైర్యముంటే ఎన్నికల్లో తమను ఎదుర్కొవాలని కానీ, దొంగచాటుగా విగ్రహాలపై ద్వంసం చేయడం పిరికిపంద చర్య అని ఆ పార్టీ సీనియర్ నేత గట్టు రాంచందర్ రావు తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విగ్రహాల ధ్వంసం..
సూర్యాపేట నియోజకవర్గంలోని తాళ్లకాంపాడు గ్రామంలో రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో వైయస్ఆర్ విగ్రహం పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి రాంరెడ్డి నాయకత్వంలో.. గ్రామానికి వెళ్లి పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించారు. విగ్రహాన్ని తగులబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైయస్ఆర్ శ్రేణులు తిరిగి విగ్రహాన్ని పునరుద్ధరణ చేసుకున్న తర్వాత కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం అట్టకొమ్ముగూడెం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహంపై దాడి జరిగింది. వైయస్ఆర్ గారు మరణించిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఇంటి వ్యక్తిని కోల్పోయినట్టు అన్నారని తెలిపారు.
సొంత ఇంటి మనిషి
ప్రతీ గుండె విలపించింది, కొన్ని గుండెలు కూడా ఆగిపోయాయని గట్టు రామచంద్రరావు గుర్తుచేశారు. గ్రామాల్లో ఓ ముసలమ్మ బతికింది అంటే అది రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలతోనే అని చెప్పారు. 108 కనబడుతుందటే అది రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన పథకమేనని వివరించారు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి పెద్ద చదువులు పేదింటి బిడ్డలు చదువుతున్నారంటే ఫీజురీయింబర్స్ మెంట్ తీసుకువచ్చిన రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనని వివరించారు. ప్రజలంతా ఆయా గ్రామాల్లో పైసా పైసా వేసుకుని కట్టుకున్న విగ్రహాలను కూల్చే హక్కు ఎవరికీ లేదన్నారు.
Recommended Video
చర్యలు తీసుకోరా..?
దాడికి సంబంధించి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాస్వామ్య వాదులు ఈ చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ వైయస్ఆర్ విగ్రహాలపై దాడి.. రేపు ఇతర విగ్రహాలపై దాడులు చేయొచ్చు అని చెప్పారు. అధికార పార్టీ అధికారులను ఆదేశించి దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసి వినతిపత్రం అందజేస్తామని వివరించారు. అధికార పార్టీని పట్టించుకోకుంటే ప్రజలు తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.