కాల్పుల కేసులో వైసీపీ నేతకు మూడేళ్ల జైలు
హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. పార్టీల నేతలంతా ప్రచార హడావిడిలో బిజీగా ఉన్నారు. మరో 20 రోజుల్లో అభ్యర్థులతో పాటు పార్టీల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇలాంటి కీలకమైన సమయంలో గెలుపు కోసం పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా పనిచేస్తుండగా.. వైసీపీకి చెందిన ఓ లీడర్ కు మాత్రం పెద్ద కష్టమొచ్చిపడింది. గతంలో తాను చూపిన అత్యుత్సాహం ఇప్పుడు ఆయనను కటకటాల వెనక్కి నెట్టింది. ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు ఊచలు లెక్కపెట్టేలా చేసింది.
నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం: ఊడి పడ్డ హోటల్ బోర్డు
ఇంతకీ ఎవరా నేత? శిక్ష ఎందుకు పడింది?
మూడేళ్ల శిక్ష పడిన ఆ వైసీపీ నేత, మాజీ ఎమెల్సీ రెహమాన్. ఏడేళ్ల క్రితం అత్యుత్సాహంతో వైసీపీ కార్యాలయం వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరపడం ఆయన కొంపముంచింది. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు విన్న హైదరాబాద్ 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాసులు ఆయనకు శిక్ష ఖరారు చేశారు. 3 సంవత్సరాల నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?
2011 జూన్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ 15 స్థానాలు సొంతం చేసుకుంది. దీంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. విక్టరీని సెలబ్రేట్ చేసుకునేందుకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బంజారా హిల్స్ లోని వైసీపీ ఆఫీసు వద్ద చేరుకున్నారు. పటాకులు కాలుస్తూ వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్యకర్తలు అప్పటి ఎమ్మెల్సీ హెచ్. ఎ. రెహ్మాన్ ను ఎత్తుకున్నారు. ఆనందం ట్టలేకపోయిన రెహ్మాన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ హఠాత్పరిణామంతో చాలా మంది ఏం జరుగుతుందో అర్థం కాక బెదిరిపోయారు. దీంతో ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ ఎస్సై సైదులు రెహ్మాన్ పై ఐపీసీ సెక్షన్ 336, ఆయుధ చట్టంలోని సెక్షన్ 27(1) కింద నమోదుచేశారు.
కేసు చెల్లదని భావించిన వైసీపీ నేతలు
తుపాకీ కాల్పుల కేసులో ఫిర్యాదుదారు, సాక్షి కూడా ఎస్సై సైదులు కావడంతో కేసు చెల్లదని అంతా భావించారు. అయితే ఎస్సై పక్కా ఆధారాలతో కేసు ఫైల్ చేయడంతో రెహ్మాన్ అడ్డంగా బుక్కయ్యాడు.