మరో సుపారీ గ్యాంగ్తోనూ డీల్... హేమంత్ పరువు హత్యలో మరో సంచలనం...
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన హేమంత్ పరువు హత్య కేసులో మరో అంశం వెలుగుచూసింది. ఎలాగైనా హేమంత్-అవంతిలను విడదీయాలనే ఉద్దేశంతో గతంలోనూ ఓ సుపారీ గ్యాంగ్తో అవంతి మేనమామ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. హేమంత్-అవంతి పెళ్లి చేసుకున్న ఒకటి,రెండు నెలలకే ఈ సుపారీ గ్యాంగ్ను యుగంధర్ రెడ్డి సంప్రదించినట్లు తేలింది.
వాన్ని చంపేదాకా అన్నం మెతుకు ముట్టను... అవంతి తల్లి శపథం... హేమంత్ హత్యపై వెలుగులోకి సంచలన విషయం...
తాజా సమాచారం ప్రకారం... హేమంత్ను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అవంతిని విడదీసేందుకు ఆ సుపారీ గ్యాంగ్తో యుగంధర్ రెడ్డి రూ.10లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. అప్పటినుంచి యుగంధర్ రెడ్డి రెండు,మూడుసార్లు పలువురితో రెక్కీ నిర్వహించి హేమంత్ సమాచారాన్ని ఆ గ్యాంగ్కి చేరవేశాడు. అయితే ఆ గ్యాంగ్ మాత్రం ఏవేవో కారణాలతో హేమంత్ కిడ్నాప్ను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక లాభం లేదనుకుని బిచ్చూ యాదవ్ గ్యాంగ్ను సంప్రదించాడు యుగంధర్ రెడ్డి. వాళ్లతో డీల్ కుదుర్చుకుని హేమంత్ను కిడ్నాప్,హత్య చేయించాడు.
గత శుక్రవారం(సెప్టెంబర్ 25) సంగారెడ్డి సమీపంలో రోడ్డు పక్కన హేమంత్ మృతదేహం లభ్యమవడంతో పరువు హత్య కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అంతకుముందు,రోజు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న అతని ఇంటికి అవంతి ఫ్యామిలీ వెళ్లారు. హేమంత్-అవంతిలను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గమధ్యలోనే కారును ఓఆర్ఆర్ వైపు తిప్పడంతో ఇద్దరూ కిందకు దూకే ప్రయత్నం చేశారు.
Recommended Video
ఈ క్రమంలో అవంతి తప్పించుకోగా... హేమంత్ను కిరాయి మనుషులు కొట్టుకుంటూ తీసుకెళ్లి మళ్లీ కారు ఎక్కించారు. అనంతరం జహీరాబాద్ వైపు వెళ్లి... అక్కడే తాడును హేమంత్ గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సంగారెడ్డిలో పడేసి వెళ్లిపోయారు. అవంతి కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్రంగా రగిలిపోయిన ఆమె తల్లి,తండ్రి లక్ష్మారెడ్డిలే ఈ హత్య చేయించినట్లు తేలింది. లక్ష్మారెడ్డి బావమరిది,అవంతి మేనమామ యుగంధర్ ఈ మొత్తం ప్లాన్ను అమలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.