జహీరాబాద్లో కాల్పుల కలకలం: భూ వివాదంలో రౌడీషీటర్ ఎంట్రీ, దాడులు, గాల్లోకి ఫైరింగ్
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని గోవిందపూర్ గ్రామ శివారులో కాల్పులు కలకలం రేపాయి. భూ వివాదం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. దాడులు చేసుకోవడంతో ఒకరికి గాయాలయ్యాయి.
సుమారు 10 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాళ భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన కమల్ కిశోర్ పల్లాడ్ గోవిందపూర్ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104, 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల తన భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్కు చెందిన అలీ అక్బర్, అస్రద్లు జీడిగడ్డతాండకు వెళ్లారు. సర్వే నెంబర్ 109లో అలీ అక్బర్ భూమి ఉంది. అయితే కమల్ కిశోర్ పల్లాడ్ కడీలు వేయించే భూమిలో కూడా తమ ల్యాండ్ ఉందంటూ అలీ అక్బర్ వర్గం గొడవకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది.
ఈ క్రమంలో అలీ అక్బర్ జహీరాబాద్కు చెందిన లాయక్ అనే రౌడీ షీటర్కు ఫోన్ చేసి పిలిపించాడు. స్కార్పియో వాహనంలో ఆయుధాలతో జీడిగడ్డతాండకు చేరుకున్న లాయక్.. కర్రలు, కత్తులతో కమల్ కిశోర్ వర్గంపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీని తీసి గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన కమల్ కిశోర్ వర్గం అక్కడ్నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించారు.
Recommended Video
కమల్ కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అలీ అక్బర్, అస్రద్లను అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక రౌడీషీటర్ లాయక్ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. లాయక్పై జహీరాబాద్ రూరల్ పీఎస్లో రౌడీషీట్ తెరిచారు. 2018లో జరిగిన ఓ హత్యకు సంబంధించి లాయక్పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు.