రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటీ?: కోహ్లీకి రీప్లేస్: రెండు టెస్టులకు కేప్టెన్సీ?: ఫిట్నెస్ కాస్సేపట్లో
బెంగళూరు: భారత్-ఆస్ట్రేలియాల జట్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్ సిరీస్ మ్యాచ్లు అప్పుడే ముగిశాయి. ఇక రెండు జట్లూ సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ కోసం సమాయాత్తమౌతున్నాయి. గవాస్కర్-బోర్డర్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇక ఆరంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కాబోతోంది. అడిలైడ్ దీనికి వేదికగా మారింది. ఈ మ్యాచ్ తరువాత కేప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోన్నాడు. చివరి రెండు టెస్ట్మ్యాచ్లను అతను ఆడట్లేదు. దీనితో అతని స్థానాన్ని- ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
కాస్సేపట్లో ఫిట్నెస్ టెస్ట్..
హ్యామస్ట్రింగ్ ఇంజ్యూరీకి గురైన రోహిత్ శర్మ.. కాస్సేపట్లో ఫిట్నెస్ టెస్ట్కు హాజరు కానున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతనికి ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ టెస్టుల్లో అతను తన ఫిట్నెస్ను నిరూపించుకోవడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అది కాస్తా పూర్తయితే.. ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే.. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు ప్రయాణమౌతాడని, చివరి రెండు టెస్టుల్లో ఆడతాడనీ అంటున్నారు.
14 రోజుల క్వారంటైన్..
బీసీసీఐ డాక్టర్లు, క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి.. సమక్షంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇందులో అతను విజయం సాధించినప్పటికీ.. తొలి టెస్ట్ను ఆడే అవకాశం ఎంత మాత్రమూ లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి బీసీసీఐ బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థను అమలు చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని అతను గడపాల్సి ఉంటుంది. క్వారంటైన్ కాలం ముగిసే నాటికి తొలి టెస్టు మ్యాచ్ ముగుస్తుంది. అందుకే చివరి రెండు టెస్టులకు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
విరాట్ వెనక్కి..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన అడిలైడ్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత.. విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరుగు ప్రయాణం అవుతాడు. అతని భార్య, బాలీవుడ్ నటి అనూష్క శర్మ ప్రసవ సమయం దగ్గర పడినందున అతను ఇంటికి చేరుకుంటాడు. దీనికోసం విరాట్ కోహ్లీ ఇదివరకే బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ సేవలు జట్టుకు అవసరమౌతాయని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే.. జట్టు కేప్టెన్సీ పగ్గాలను అతనికే అప్పగించడం దాదాపు లాంఛనప్రాయమే అవుతుంది.
టెస్ట్ మ్యాచ్ల షెడ్యూల ఇదీ..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం బాక్సింగ్ డే టెస్ట్.. ఈ నెల 26న ఆరంభమౌతుంది. దీనికి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదిక. జనవరి 7 నుంచి 11 వరకు మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సాగుతుంది. చివరి టెస్ట్.. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో నిర్వహిస్తారు. దీనితో భారత క్రికెట్ జట్టు రెండున్నర నెలల ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. భారత పర్యటనకు రానుంది.