విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కఠినమైన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న వేళ. మరో మూడు రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల సిరీస్ ఆరంభం కాబోతోన్న సందర్భంలో కేప్టెన్ విరాట్ కోహ్లీ..సరికొత్త సంకట స్థితిలో పడ్డాడు. రోహిత్ శర్మ రూపంలో గండాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యాటన.. విరాట్ కోహ్లీ భవితవ్యాన్ని తేల్చబోతోంది. అతనికి అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్లో గనక టీమిండియా సక్సెస్ రేటు ఏ మాత్రం తేడా కొట్టినా.. కేప్టెన్సీని వదులుకోక తప్పని పరిస్థితిని కల్పించింది.
ఐపీఎల్ ఎఫెక్ట్..
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ తన కేప్టెన్సీ నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించగలుగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులతో బెస్ట్ సక్సెస్ఫుల్ కేప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టును అయిదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఒకవంక కేప్టెన్సీ భారాన్ని మోస్తూనే.. బ్యాటింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. టన్నుల కొద్దీ పరుగులను సాధిస్తున్నాడు. ఇదే అతనికి ప్లస్ పాయింట్ అవుతోంది.
ఆర్సీబీ కేప్టెన్గా విఫలం..
రోహిత్ శర్మతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్గా విరాట్ కోహ్లీ..ఒక్కసారి కూడా జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఫైనల్కు చేరిన సందర్భాలు కూడా నామమాత్రమే. బ్యాట్స్మెన్గా కూడా అతనిలో నిలకడ లోపించింది. అంతర్జాతీయ మ్యాచ్ల తరహాలో అతని ఆటతీరు ఉండట్లేదు. ఐపీఎల్ మ్యాచ్లల్లో విఫలమౌతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్-2020 సీజన్లోనూ అదే పరిస్థితి. టోర్నమెంట్ లీగ్ దశలో ఆర్సీబీ వరుస విజయాలను అందుకున్నప్పటికీ.. మ్యాచ్లు సాగుతున్న కొద్దీ డీలా పడింది. అతి కష్టం మీద ప్లేఆఫ్కు చేరుకుంది. అక్కడా బోల్తా కొట్టింది.
లాజిక్ లాగిన గౌతమ్ గంభీర్..
విరాట్ కోహ్లీ కేప్టెన్సీ విషయంలో టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ ఏ మాత్రం సంతృప్తికరంగా ఉండట్లేదు. ఇదివరకు ఐపీఎల్లో కోల్కత నైట్ రైడర్స్కు కేప్టెన్సీ వహించిన గౌతమ్.. కోహ్లీని తప్పించడమే బెటర్ అని స్పష్టం చేశాడు. టీమిండియా కేప్టెన్గా కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ ఆప్షన్ అని కుండబద్దలు కొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్లల్లో క్రికెటర్ల ఆటతీరును ఆధారంగా చేసుకుని టీమిండియాకు వారిని ఎంపిక చేస్తోన్న సమయంలో.. అదే ఐపీఎల్ను ప్రాతిపదికగా తీసుకుని, భారత క్రికెట్ జట్టు కేప్టెన్ను ఎందుకు ఎంపిక చేయకూడదనేది గంభీర్ లాజిక్.
ఆర్సీబీ ప్లేయర్ కూడా రోహిత్ వైపే..
ఐపీఎల్ టోర్నమెంట్లలో రాయల్ ఛాలెంజర్స్ తరఫున విరాట్ కోహ్లీ కేప్టెన్సీలో ఆడుతోన్న పార్థివ్ పటేల్ సైతం రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తన సొంత కేప్టెన్ను కాదని.. రోహిత్కే అతను ఓటు వేయడం ఆసక్తి రేపుతోంది. కేప్టెన్గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మనే బెటర్ అని వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడికి లోనుకాకుండా సరైన నిర్ణయాలను తీసుకోవడంలో కోహ్లీ కంటే రోహిత్ శర్మ చురుగ్గా ఉంటాడని పేర్కొన్నాడు. కోహ్లీ ఒత్తిడి లోనవుతాడని, తన అసహనాన్ని, ఆవేశాన్ని అతను దాచుకోలేడని చెప్పాడు.
కోహ్లీకి అగ్నీపరీక్షే..
కోహ్లీసేన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ నెల 27వ తేదీన తొలి వన్డే ఆరంభం కాబోతోంది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యక్తమౌతున్న కేప్టెన్సీ మార్పు డిమాండ్.. అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది చర్చనీయాంశమౌతోంది. కేప్టెన్సీ మార్పు బలంగా వినిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కఠినమైన ఆస్ట్రేలియా సిరీస్..విరాట్ కోహ్లీకి అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్లో కోహ్లీ.. వ్యక్తిగతంగా భారీ స్కోరును సాధించడంతో పాటు.. జట్టుకు విజయాన్ని అందించాల్సి ఉంటుందనే విషయాన్ని తేల్చి చెప్పింది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా కేప్టెన్సీని వదులుకోవడం తప్పకపోవచ్చు.