టీమిండియా మళ్లీ పాతకథ: 32 పరుగులకే చివరి అయిదు వికెట్లు:
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు మళ్లీ పాతకథే పాడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్ట్ తరహాలో పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమైనట్టే ఉంది. అదే తడబాటు.. అదే తొట్రుపాటు. ఆస్ట్రేలియా జట్టుపై ఆధిపత్యాన్ని చలాయించడానికి, తొలి టెస్ట్లో ఘోర పరాభవానికీ ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నట్టయింది. చివరి అయిదు వికెట్లను 32 పరుగులకే కోల్పోయింది. ఒక్క పరుగు తేడాతో చివరి మూడు వికెట్లను టీమిండియా కోల్పోయింది. 326 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయినప్పటికీ.. ఆస్ట్రేలియాపై 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించినట్టయింది.
అజింక్య రహానెతో ఆరంభం..
అయిదు వికెట్ల నష్టానికి 277 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆటను ఆరంభించింది టీమిండియా. స్కోర్బోర్డు మీద 17 పరుగులు జోడించిన తరువాత తొలి వికెట్ పడంది. అజింక్య రహానె అవుట్ అయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీతో నాటౌట్గా నిలిచిన అతను.. మరో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ దారి పట్టాడు. ఆ తరువాత వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. క్రీజ్లో ఉన్న రవీంద్ర జడేజా సహా..మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన లేకపోయారు.
లేని పరుగు కోసం..
నాథన్ లియాన్ వేసిన బంతిని షార్ట్ కవర్ వైపు షాట్ ఆడిన రవీంద్ర జడేజా లేని రన్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్న అజింక్య రహానె క్రీజ్ను వదిలి ముందుకెళ్లాడు. అతను రన్ను పూర్తి చేసే లోపే బెయిల్స్ గాల్లోకి ఎగిరాయి. జడేజా ఆడిన బంతిని ల్యాంబుషేన్ అందుకుని, కీపర్ టిమ్ పెయిన్కు అందించడం, అతను వికెట్లను గిరాటేయడం చకచకా సాగిపోయాయి. రహానే రూపంలో 294 పరుగుల వద్ద ఆరో వికెట్ పడింది.
విజృంభించిన లియాన్..
జట్టు స్కోరు 306 పరుగుల వద్ద రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ సంధించిన బౌన్సర్ను షాట్ ఆడాడు. మిడ్ వికెట్ బౌండరీ వైపు భారీ షాట్ కొట్టాడు. సరిగ్గా కనెక్ట్ కాలేకపోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బౌన్సర్ పాట్ కమ్మిన్స్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా పెవిలియన్ దారి పట్టాడు. ఆ వెంటనే రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ అవుట్ అయ్యాడు..ఆఫ్ స్టంప్కు అవతల హేజిల్వుడ్ వేసిన బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ వైపు షాట్ ఆడాడు అశ్విన్. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి నేరుగా లియాన్ చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 325.
ఒక పరుగు తేడాతో..
చివరి వికెట్లను కోల్పోవడానికి టీమిండియాకు ఎంతో సమయం పట్టలేదు. స్కోర్బోర్డు మీద ఒక పరుగు మాత్రమే జత చేశారు మిగిలిన బ్యాట్స్మెన్లు. టెయిలెండర్లు ఉమేష్ యాదవ్ 9 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా ఖాతా తెరవకుండా అవుట్ అయ్యారు. మహ్మద్ సిరాజ్ నాటౌట్గా నిలిచాడు. టెయిలెండర్లలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ నిలదొక్కుకుని ఉన్నప్పటికీ.. భారత జట్టు మరింత భారీ ఆధిక్యాన్ని సాధించడానికి అవకాశం ఉండేది. అనవసరపు షాట్లకు ప్రయత్నించి.. వికెట్లను కోల్పోయారు.