కోహ్లీ..ఆసీస్ నుంచి అర్ధాంతరంగా వెనక్కి: స్వదేశానికి తిరుగుముఖం: కేప్టెన్ ఎవరు?
మెల్బోర్న్: ఊహించినట్టే.. భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఆస్ట్రేలియా నుంచి భారత్కు రాబోతోన్నాడు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో ఘోర పరాయజం తరువాత.. టీమిండియా రెండో మ్యాచ్ కోసం సన్నాహాలు చేస్తొండగా.. విరాట్ కోహ్లీ విమానం ఎక్కాడు. టీమిండియా ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లను ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అతను అర్ధాంతరంగా వెనక్కి మళ్లాడు. స్వదేశానికి బయలుదేరాడు. దీనితో ఈ నెల 26వ తేదీన ఆరంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్కు అజింక్య రహానే సారథ్యాన్ని వహించబోతోన్నాడు.
New Coronavirus strain: భారత్లో అప్పుడే ఎంట్రీ? బ్రిటన్ నుంచి వచ్చిన అయిదుమందిలో లక్షణాలు
పితృత్వ సెలవుల మీద
విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల మీద భారత్కు రానున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయనకు సెలవుల్లో వెళ్లడానికి ఇదివరకే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. జనవరిలో ఆమె బిడ్డను ప్రసవించాల్సి ఉంది. తొలివారంలో కాన్పు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే- నెలలు నిండిన ప్రస్తుత పరిస్థితుల్లో భార్య వద్ద గడపాలనే కారణంతో విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల్లో వెళ్లనున్నాడు.
జట్టు ప్లేయర్లతో భేటీ..
విమానాశ్రయానికి బయలుదేరడానికి ముందు విరాట్ కోహ్లీ.. జట్టు సభ్యులతో చాలాసేపు గడిపాడు. వారిలో స్ఫూర్తినింపాడు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో దారుణ పరాజయం చవి చూసిన టీమిండియా జట్టులో నిరుత్సాహ వాతావరణం నెలకొంది. దాన్ని తొలగించేలా విరాట్ కోహ్లీ.. జట్టు ప్లేయర్లను ఉద్దేశించి మాట్లాడారు. గేమ్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ.. అడిలైడ్ టెస్ట్లో ఎదురైన పరాజయాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవాలని, బాక్సింగ్ డే టెస్ట్లో దానికి ప్రతీకారం తీర్చుకునేలా ఆడాలని సూచించారు. తాను లేకపోయినప్పటికీ.. తనకంటే మెరుగ్గా ఆడే ప్లేయర్లు ఉన్నారని చెప్పారు.
క్వారంటైన్లో రోహిత్ శర్మ..
కాగా- విరాట్ కోహ్లీ గైర్హాజరీలో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు అజింక్య రహానే నాయకత్వం వహించబోతోన్నాడు. టెస్ట్ జట్టుకు అతను వైస్ కేప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ టెస్ట్ పోగా.. మిగిలిన రెండింటికీ రోహిత్ శర్మ కేప్టెన్సీ వహించే అవకాశం ఉంది. ఫిట్నెస్ను నిరూపించుకున్న రోహిత్ శర్మ.. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతను సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని గడుపుతున్నాడు. రెండో టెస్ట్ ఆరంభం అయ్యే సమయానికి క్వారంటైన్ పూర్తయ్యే అవకాశం లేనందున. అతను ఆ మ్యాచ్కు దూరం అయ్యాడు.
ఘోర ఓటమి నుంచి తేరుకుంటుందా?
అడిలైడ్ టెస్ట్లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. టెస్ట్ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరుగా రికార్డులకు ఎక్కింది. ఈ మ్యాచ్ను ఎనిమిది వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది ఆసీస్ టీమ్. ఒకవంక- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడం, మరోవంక ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..గాయపడటం వంటి పరిణామాల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్్ ఆరంభం కాబోతోంది. ఆ ముగ్గురూ కీలక ఆటగాళ్లు లేని టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా జట్టును ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. అటు ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్ బాక్సింగ్ డే టెస్ట్ను మిస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.