India Vs Aus:గబ్బాలో కుమ్మేసిన కుర్రాళ్లు.. వీరి క్రికెట్ కష్టాలు తెలిస్తే కన్నీరే..!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టీమిండియాలో పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగిన జట్టు బలమైన ఆసీస్ వెన్ను విరిచింది. భారత జట్టులో సగం మంది క్రికెటర్లు పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేనివారే కావడం విశేషం. అంతేకాదు ఈ క్రికెటర్లంతా భారత్లో ఎక్కడో చిన్న పట్టణాల నుంచి వచ్చి తమ నైపుణ్యానికి పదను పెట్టి సత్తా చాటిన వారే. ఇంతకీ వీరెవరు.. చారిత్రాత్మక విజయంలో వీరి పాత్ర ఏంటి..?
Recommended Video
అరంగేట్రంలోనే అదరగొట్టిన కుర్రాళ్లు
నటరాజన్, మొహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్... వీరంతా ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపిక కాకపోయి ఉంటే ఈ రోజు టీవీల ముందు కూర్చొని భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లు వీక్షిస్తూ ఉండేవారు. ఇది కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ-20 మ్యాచ్లు ఆడుతూ ఉండేవారు. కానీ ఒకే ఒక్క ఛాన్స్ వారి తలరాతనే మార్చేసింది. వీరంతా టీట్వంటీలో సత్తా చాటినప్పటికీ... టెస్టు క్రికెట్లో రాణించడమంటే కచ్చితంగా అది ఒక చెప్పుకోదగ్గ విషయమే. వీరందరికీ వ్యక్తిగతంగా, లేదా కుటుంబ పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ అన్నీ మనసులోనే దిగమింగుకుని దేశం కోసం బరిలోకి దిగి లక్ష్యాన్ని సాధించారు. ఆస్ట్రేలియాకు ఘనచరిత్ర ఉన్న గబ్బా క్రికెట్ స్టేడియంలో ఈ కుర్రాళ్లు ఆసీస్కు చరిత్ర లేకుండా చేశారు.1988 నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో ఓటమి చవిచూడలేదు. కానీ టీమిండియా ధాటికి ఆసీస్ తోకముడిచింది.
నట్టూ భాయ్.. నలిపేశాడు
ఒకసారి నటరాజన్ విషయానికొస్తే... తమిళనాడులోని సేలం జిల్లాలోని చిన్నప్పంపట్టి అనే చిన్న టౌన్ నుంచి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అదే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చాడు. వీరిద్దరూ గబ్బా వేదికగా టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నటరాజన్.. బయో బబుల్లోనే ఉన్నాడు. తనకు కూతురు పుట్టిన విషయం తెలిసినప్పటికీ తండ్రిగా ఆనందం పొందాడు తప్పితే ఆ చిన్నారిని ఇప్పటి వరకు చూడలేదు. భారత్ గెలుపు మాత్రమే తన ముందున్న లక్ష్యం అన్నట్లుగా దూసుకెళ్లి విజయంలో భాగస్వామి అయ్యాడు.
సింహంలా పంజావిసిరిన సిరాజ్
ఇక మన హైదరాబాదీ క్రికెటర్ మొహ్మద్ సిరాజ్ కథ గురించి చెప్పాలంటే తానొక ఆటోడ్రైవర్ కుమారుడు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు సిరాజ్. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే తండ్రి మరణించాడన్న వార్తతో ఎంతో కలత చెందాడు. బాధను దిగమింగుకుని దేశంకోసం నడుం బిగించాడు. తన గురించి ప్రపంచం మాట్లాడుకునేది తన తండ్రి వినకుండానే వెళ్లాడనే బాధ సిరాజ్కు ఉంది. ఇదంతా ఇలా ఉంటే ఆస్ట్రేలియా ప్రేక్షకుల నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలను సైతం ఎదుర్కొన్నాడు సిరాజ్. అయినా వాటన్నిటినీ దిగమింగుకుని తన సత్తా చాటాడు. లక్ష్యం వైపు కదిలి విజయం సాధించాడు. ఓ వైపు బలమైన ప్రత్యర్థి ఆసీస్ను ఎదుర్కొంటూనే మరోవైపు ఆస్ట్రేలియా ప్రేక్షకుల జాతి వివక్ష వ్యాఖ్యలకు కూడా బంతితో సమాధానం చెప్పాడు.
టెన్నిస్ బాల్తో క్రికెట్ ప్రయాణం
ఇక మరో ఆటగాడు నవదీప్ సైనీ క్రికెట్ కష్టాలు కూడా మామూలుగా లేవు. ప్రభుత్వ డ్రైవర్గా పనిచేసే సైనీ తండ్రి తన కొడుకుకు క్రికెట్ కిట్ కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో ఉండేవాడు. తన క్రికెట్ ప్రయాణంను టెన్నిస్ బాల్తో ప్రారంభించాడు సైనీ. మ్యాచ్కు రూ.300 ఫీజు తీసుకున్నాడు. ఇక సైనీ టాలెంట్ను చూసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఢిల్లీ జట్టుకు పరిచయం చేశాడు. అక్కడే సైనీ దిశ మారింది. ఇక వేగంగా బంతులు సంధించే సైనీ.. గాయం కారణంగా గబ్బా స్టేడియంలో కేవలం 12.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
ప్రత్యర్థికి చుక్కులు చూపించిన కుర్రాళ్లు
వీరంతా బరిలో అడుగుపెట్టినప్పుడు భయపడలేదు. వీరి దృష్టంతా వికెట్లు తీయడంపైనే పెట్టారు. ఇందుకు వారు నమ్ముకున్న బేసిక్స్నే అస్త్రంగా ప్రయోగించారు. దీంతో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా... మొహ్మద్ సిరాజ్ 6 వికెట్లు, సుందర్ 4 వికెట్లు, శార్దుల్ 7 వికెట్లు తీశారు. ఇక సుందర్ మరియు శార్దుల్లు బ్యాటింగ్లో కూడా ఇరగదీశారు. ఇద్దరు తొలి ఇన్నింగ్స్లో అర్థసెంచరీలు చేశారు. వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు చేరువచేసింది. ఇలా ఈ కుర్రాళ్లు ప్రత్యర్థి ఎవరా అని భయపడలేదు.. కేవలం లక్ష్యం వైపే కదిలి చారిత్రాత్మక విజయం అందించారు.