మాజీ ఉద్యోగిని లింగ వివక్ష కేసు: విప్రోకి ఊరట
లండన్: తమ సంస్థలో ఉద్యోగుల పట్ల లింగ వివక్ష చూపుతున్నారంటూ దాఖలైన కేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు ఊరట లభించింది. లండన్లోని తమ కార్యాలయంలో మార్కెట్ డెవలప్మెంట్ మేనేజరుగా పనిచేసిన శ్రేయా ఉకిల్ వేసిన కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని విప్రో తెలిపింది.
పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా సంస్థ వివక్ష చూపుతోందని, పైగా కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ.. అందుకు పరిహారంగా 1.2 మిలియన్ పౌండ్లను (సుమారు 11 కోట్ల 60 లక్షల రూపాయలు) చెల్లించాలని కోరింది. ఈ మేరకు శ్రేయా ఉకిల్ బ్రిటన్ ఎంప్లాయీస్ ట్రైబ్యునల్లో కేసు వేయడం జరిగింది.
అయితే, కంపెనీ నియమ నిబంధనలను పాటించనందునే శ్రేయాతో పాటు మరో ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించడం జరిగిందని, ఇందులో వివక్ష అన్నది లేనేలేదని విప్రో వాదించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ట్రైబ్యునల్ తమ వాదనను సమర్థిస్తూ, తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్రో వెల్లడించింది.
కాగా, ఇప్పటికైనా మహిళలను సమానంగా చూడాలని, సమాన వేతనాలు చెల్లించాలని ఉకిల్ కోరుతున్నారు. ఈ తీర్పు కంపెనీకి పూర్తి అనుకూలంగా ఏమీ లేదని, మహిళలు సమాన హక్కుల కోసం పోరాడేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు.