ఒకటి కాదు రెండు కాదు.. 12 వందల క్వింటాళ్ల ధాన్యం పాడైంది.. ఎక్కడ, ఎందుకో తెలుసా..!!
రాంచీ : జార్ఖండ్ .. ఆకలితో అలమటిస్తోంది. కడు పేదరకింతో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఆకలితో తనువు చాలిస్తున్నారు. అన్నమో రామచంద్రా అని అంటూంటే .. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 1200 క్వింటాళ్ల ధాన్యం వారి నిర్లక్ష్యంతో పాడవడం ఆందోళన కలిగిస్తోంది. అదీ కూడా మధ్యాహ్న భోజనం కోసం పంపించాల్సిన ధాన్యం తడిసి పాడవడం నిర్లక్ష్యానికి అద్దంపడుతుంది.
తడిసిన ధాన్యం ..
రాంచీలోని ఓ రేషన్ షాపులో 1200 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయ్యింది. అయితే ఇది పేదలకు పంచేది కూడా కాదు. కొన్ని మధ్యాహ్న భోజన కేంద్రాలకు తరలించాల్సిన సరుకు. ఆ రేషన్ షాపులో అంత్యోదయ రేషన్ కార్డువారి కోసం ఇవ్వాల్సిన 1009 క్వింటాళ్ల ధ్యానంతో పాటు వీటిని కూడా పెట్టారు. అయితే అవి వివిధ పాఠశాలలకు పంపించడం కాస్త ఆలస్యమైంది. అయితే వర్షాకాలం కావడంతో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో నిల్వచేసిన గోదాంలోకి వరదనీరు చేరి ధాన్యం తడిచిపోయింది.
ఏం జరిగిందంటే ...
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టు దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పాఠశాలలకు పంపించాల్సిన ధాన్యం గురించి ఇప్పటికే సంబంధింత అధికారులకు సమాచారం అందజేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి సర్యు రాయ్ పేర్కొన్నారు. కానీ వారెవరు స్పందించలేదని గుర్తుచేశారు. దాంతో అంతమొత్తంలో ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కాలేదని పేర్కొన్నారు. చివరికి ఉన్న గోదాంలోనే నిల్వ చేశామని .. అయితే వర్షానికి తడిసిపోయిందని గుర్తుచేశారు. ధాన్యం తడిసిపోయేందుకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
మాటలు-మంటలు
దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రజా పంపిణీ వ్యవస్థను జార్ఖండ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించింది కాంగ్రెస్. దీంతో ప్రజలకు, మధ్యాహ్న భోజన పథకానికి చేరాల్సిన ధాన్యం సరిగ్గా చేరడం లేదన్నారు అధికార ప్రతినిధి అలోక్ దూబే. ధాన్యం నిల్వ చేయడంలో ప్రజా పంపిణీ వ్యవస్థ విఫలమైందన్నారు సుప్రీంకోర్టులో ఆహార వ్యవస్థ సలహాదారు బాలరామ్. లబ్ధిదారులకు సరైన సమయంలో ధాన్యం ఎందుకు చేరలేదని ప్రశ్నించారు.