కోటి మంది వలసకూలీలు: కాలినడకన స్వస్థలాలకు చేరిక, పార్లమెంట్లో మంత్రి వీకే సింగ్..
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అమలు చేయడంతో.. తొలినాళ్లలో వలసకూలీలు వెతలు అన్నీ ఇన్నీ కావు. పని లేక, వలస వచ్చిన చోట ఉండలేక తమ స్వస్థలాలకు బయల్దేరారు. అలా ఒక్కో కూలీ కథ కన్నీరు తెప్పించింది. అయితే మార్చి నుంచి జూన్ వరకు కోటి మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలియజేశారు.
దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కోటి 6 లక్షల మంది వలసకూలీలు కాలి నడకన తమ స్వగ్రామాలకు చేరుకున్నారని వీకే సింగ్ తెలిపారు.. అయితే ఆ సమయంలో 81 వేల 385 ప్రమాదాలు కూడా జరిగాయాని వివరించారు. ప్రమాదాలతో 29 వేల 415 మంది చనిపోయారని పార్లమెంట్కు తెలియజేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వలస కూలీలకు సంబంధించి ప్రత్యేక వివరాలతో కూడా సమాచారం తమ వద్ద ఏమీ లేదు అని పేర్కొన్నారు.
వలస కార్మికులకు ఆశ్రయం కల్పించాలని రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు హోం శాఖ తగిన ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఆహారం, నీరు, వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించడం లాంటి విధులు నిర్వహించిందని సింగ్ పేర్కొన్నారు. కాలినడకన వెళ్లేవారికి ఆహారం అందజేసి.. తాగునీరు ఇచ్చి వారికి తోడ్పాటును కలుగజేసిందని తెలిపారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని.. విశ్రాంతి కల్పించిందని చెప్పారు. ఏప్రిల్ 29, మే 1వ తేదీన బస్సులు, శ్రామిక్ రైళ్ల ద్వారా కార్మికులను స్వస్థలాలకు తరలించారని పేర్కొన్నారు.