మహారాష్ట్రను కుదిపేసిన భూకంపం.. 12 నిమిషాల్లో నాలుగుసార్లు ప్రకపంనలు .. ఒకరి మృతి
పాల్ఘర్ : మహారాష్ట్రను భూకంపం వణికించింది. పాల్ఘర్ జిల్లాలో వరుస భూకంపాలతో జనం బెంబేలెత్తిపోయారు. అర్థరాత్రి సమయంలో 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. అర్థరాత్రి 1.03గంటల సమయంలో తొలిసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. అననంతరం మిగిలిన 12 నిమిషాల వ్యవధిలో 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడుసార్లు భూమి కంపించింది.
పాల్ఘర్లోని దహను ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నిమిషాల వ్యవధిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భారీ వర్షం పడుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. భూకంపం కారణంగా దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో 55ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.
2018 నవంబర్ నుంచి పాల్ఘర్ ప్రాంతంలో వరుస ప్రకంపనలు వస్తున్నాయి. ముఖ్యంగా దుదల్వాడీ గ్రామంలో ఈ ప్రకంపనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంపం వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.