ఎన్కౌంటర్కు మావోల ప్రతీకారం: తెలంగాణ బస్సుకు నిప్పు, కానిస్టేబుల్ కాల్చివేత..
రాయ్పూర్: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దులో చోటు చేసుకున్న ఎన్కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. సోమవారం అర్థరాత్రి సుకుమా జిల్లా డోర్నపాల్ మండలంలోని పెద్దకుడ్తిలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు మావోలు నిప్పు పెట్టారు.
Recommended Video
తెలంగాణలో భారీ ఎన్కౌంటర్: 10మంది మావోల హతం,మృతుల్లో హరిభూషణ్
హైదరాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్తున్న బస్సును అడ్డుకుని.. ప్రయాణికులను కిందకు దించేసి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సుతో పాటు మరో ప్రైవేటు బస్సు, ట్రాక్టర్, మూడు లారీలకు కూడా నిప్పు పెట్టారు. తగలబెట్టిన ఆర్టీసి బస్సును హైదరాబాద్ డిపోగా చెందినదిగా గుర్తించారు.
కాగా, ఇన్ ఫార్మర్ నెపంతో ఒక కానిస్టేబుల్ ను మావోలు ప్రయాణికుల ఎదుటే కాల్చి చంపినట్టు సమాచారం. అనంతరం తమ జోలికి వస్తే పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతామంటూ మావోలు నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. హెచ్చరికలతో కూడిన ఓ ఎరుపు బ్యానర్ ను వారు ప్రదర్శించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.
అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.