లవర్స్ పై దాడి: 7 మంది గ్యాంగ్ రేప్, సుమోటో కేసు, కటకటాల్లో కామంధులు, రూ. లక్ష రివార్డు!
ముంగళూరు: ప్రేమికులపై దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను పట్టుకోవడంలో శక్తి వంచన లేకుండా పని చేసిన పోలీసులను కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి యూటీ. ఖాదర్ అభినందించారు. ఎలాంటి ఒత్తిడికి పని చెయ్యకుండా పోలీసులు పని చేశారని ఆయన అభినందించి రూ. లక్ష బహుమానం ప్రకటించారు.
మంగళూరు సమీపంలోని తోటే బేంగ్రో బీచ్ లో ఇటీవల ప్రేమికుల మీద 7 మంది కామాంధులు దాడి చేశారు. అనంతరం ప్రియుడిని తాళ్లతో కట్టి అతని మీద దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లారు. 7 మంది కామాంధులు యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు.
విషయం పోలీసులకు చెబితే మిమ్మల్ని హత్య చేసి ఇదే బీచ్ లో పాతిపెడుతామని హెచ్చరించారు. బాధితులు మొదట ఫిర్యాదు చెయ్యకున్నా సమాచారం అందిన వెంటనే పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. అనంతరం బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు విచారణ చేసి ఇద్దరు మైనర్లతో సహ ఆరు మంది కామాంధులను అరెస్టు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులను అభినందించిన మంత్రి వారికి రూ. 1 లక్ష బహుమతి ప్రకటించారు. భాదితురాలికి ప్రభుత్వ పరంగా వెంటనే పరిహారం అందిస్తామని మంత్రి యూటీ. ఖాదర్ హామీ ఇచ్చారు.
ఇలాంటి కామాంధులకు కఠిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని, వీళ్లు జైలు నుంచి బయటకు రాకుండా చెయ్యడానికి న్యాయవాదులు ఎవ్వరూ కోర్టులో వాదించరాదని మంత్రి యూటీ. ఖాదర్ మనవి చేశారు. నిందితులను అతి త్వరగా పట్టుకున్న పోలీసులను మంత్రి యూటీ. ఖాదర్ మరోసారి అభినందించారు.