టీడీపీ, వైసీపీ అవిశ్వాసం: 8 రోజులుగా నిమిషాల్లో సభ వాయిదా
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వివిధ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులు ఎనిమిది రోజులు కూడా లోకసభలో చర్చకు రాలేదు. పలువురు ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే సభను వాయిదా వేస్తూ వచ్చారు.
బుధవారం సభను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. వరుసగా నాలుగు రోజులు (గురు, శుక్ర, శని, ఆది) సెలవులు కావడంతో సభ సోమవారానికి వాయిదా పడింది.
టీడీపీ, వైసీపీలు మొదట్లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఆ తర్వాత ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్, సీపీఎం, ఆర్ఎస్పీలు కూడా తోడయ్యాయి. అయితే అవిశ్వాసంపై మాత్రం చర్చ జరగలేదు. సభ సజావుగా సాగనంత వరకు అవిశ్వాసంపై చర్చ చేపట్టేది లేదని స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే అవిశ్వాసానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.
గత శుక్రవారం అవిశ్వాస నోటీసు ఇచ్చారు. అప్పుడు సభలో అవిశ్వాసం నోటీసును చదివి వినిపించిన స్పీకర్ ఒక్క నిమిషంలో, ఆ తర్వాత 19న రెండు నిమిషాల్లో, 20న ఒక నిమిషంలో, 21న రెండు నిమిషాల్లో, 22న రెండు నిమిషాల్లో, 23న మూడు నిమిషాల్లో, 27న రెండు నిమిషాల్లో, 28న మూడు నిమిషాల్లో వాయిదాపడింది.