Kanpur horror: దాడి కేసులో 10 మంది అరెస్ట్, పోలీసులపై మృతురాలి కుటుంబసభ్యుల ఫైర్
ఒళ్లు గగుర్పొడిచే కాన్పూర్ దాడి కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన పర్వేజ్, అబిద్ సహా మొత్తం 10 మందికి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదుచేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
10 మంది అరెస్ట్
ఈ నెల 9వ తేదీన లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన యువతి తల్లిపై ఆరుగురు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో వెలుగులోకి వచ్చింది. నిందితుల దాడిలో యువతి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె ఆంటీ పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను కాన్పూర్ డీఐజీ అనంత్ డియో వెల్లడించారు. మహిళపై దాడి చేసి హతమార్చిన వారికి కఠినశిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
పోలీసులపై కాల్పులు
ఈ కేసులో పర్వేజ్, అబిద్ అనే ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే వారి ఆచూకీ కనుకొన్న పోలీసులు.. పట్టుకొనేందుకు ప్రయత్నించారు. తుపాకీతో కాల్పులు జరపడంతో పోలీసులు కూడా.. ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. పోలీసులు కాల్పుల్లో ఇద్దరి కాళ్లకు గాయాలయ్యాయి. వారిద్దరికి కాన్షిరాం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, ట్రీట్మెంట్ పూర్తయ్యాక జైలుకు తరలిస్తామని తెలిపారు.
పోలీసుల నిర్లక్ష్యం
ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు స్పందిస్తూ.. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని చెప్పారు. అందుకే తాము ఒకరి ప్రాణం కోల్పోయామని వివరించారు. ‘తన మనమరాలిపై 2018లో లైంగికదాడి చేసే ప్రయత్నం చేశారు. తాము కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు. కానీ బెయిల్పై బయటకొచ్చిన వారు.. ఇంటికొచ్చి కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో తన కూతురు చనిపోయిందని, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆమెకు వైద్యం అందజేసేందుకు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించాం' అని మృతురాలి తల్లి తెలిపారు.
సమాచారం ఇచ్చినా..
ఈ నెల 9వ తేదీని బాధితురాలి తల్లి, ఆంటీపై నిందితులు దాడి చేశారని.. ఆ సమయంలో తాము పోలీసులకు సమాచారం అందజేశామని మరో బంధువు తెలిపారు. కానీ ఒక్క పోలీసు కూడా ఘటనాస్థలానికి రాలేదని, దీంతో తాము ఒక కుటుంబసభ్యురాలిని కోల్పోయామని విలపిస్తూ వివరించారు. యువకుల దాడిలో తన తల్లి చనిపోవడంతో బాధిత యువతి షాక్ తిన్నారు. ఆంటీ పరిస్థితి సీరియస్గా ఉండటంపై కూడా ఆందోళన చెందారు. అంతేకాదు లైంగికదాడి ఘటన జరిగిన రెండేళ్ల నుంచి తాను స్కూల్కి కూడా వెళ్లడం లేదని పేర్కొన్నది..
బెయిల్పై బయటకొచ్చి..
కాన్పూర్కి చెందిన మైనర్ బాలికపై 2018లో అబిద్, మింటు, మహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే మృగాళ్లు లైంగికదాడికి తెగబడ్డారు. ఈ విషయం అప్పట్లో బాలిక ఇంట్లో చెప్పడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయగా.. వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా నిందితులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇంటిలో దాడి
బెయిల్ మీద బయటకొచ్చిన మృగాళ్లు.. గత గురువారం యువతి ఇంటికెళ్లారు. లైంగికదాడికి సంబంధించి కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. అందుకు యువతి తల్లి నిరాకరించడంతో.. వారి ఇంట్లోనే చితక్కొట్టారు. ఒకడు అయితే తన కాలితో మహిళ మొహంపై తన్నాడు. మహిళతోపాటు కూతురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే.